టీమిండియాకు బిగ్ షాక్.. లంక టూర్ నుంచి బుమ్రా ఔట్..!

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కు ముందు భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక టూర్ కు దూరమమయ్యాడు.

Post Published By: dialnews
Updated : 3 August 2026, 7:00 PM IST

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కు ముందు భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంక టూర్ కు దూరమమయ్యాడు. జూలై 28న ప్రకటించిన భారత 15 మంది సభ్యుల జట్టులో బుమ్రాకు చోటు కల్పించినప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని అప్పట్లో బీసీసీఐ పేర్కొంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్‌కు దూరంగా ఉంచాలని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బుమ్రా ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యాడనీ, శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉంటాడని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన తదుపరి వైద్య పరీక్షల్లో అతడు ఎడమ మోకాలిలో ఇంకా ఇబ్బంది ఉన్నట్టు వైద్య బృందం గుర్తించినట్లు సమాచారం.

దీంతో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అతడికి మరింత విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. గతంలో గాయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే ఆటగాళ్లను మైదానంలోకి దింపడంతో సమస్యలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. బుమ్రా విషయంలో అలాంటి పొరపాటు మళ్లీ చేయకూడదనే ఉద్దేశంతో అతడిని పూర్తిగా కోలుకున్న తర్వాతే అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆసియా క్రీడలు, న్యూజిలాండ్ పర్యటన, వచ్చే ఏడాది జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక సిరీస్‌లు ఉండటంతో అతని ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

బుమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ అఖిబ్ నబీ దార్ ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించకపోయినా, 2025-26 రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసి జమ్మూ కశ్మీర్‌కు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత పేస్ ఎటాక్ లో బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ ఉన్నారు. బుమ్రా దూరమైతే మహ్మద్ సిరాజ్ పేస్ దాడికి నాయకత్వం వహించగా, ప్రసిద్ధ్ కృష్ణ ప్రధాన పేసర్‌గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా దూరమవడం భారత బౌలింగ్ కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

Published : 
  • 3 August 2026, 7:00 PM IST