టీ20 ఫార్మాట్ లో వరల్డ్ ఛాంపియన్స్ అయిన భారత్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. తొలి టీ20 తరహాలోనే మరోసారి సమిష్టిగా రాణించిన ఐర్లాండ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండో మ్యాచ్ లో భారత్ పై 1 పరుగు తేడాతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది.ఐర్లాండ్ జట్టు టీమిండియాపై సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత పుంజుకుని సిరీస్ సమం చేస్తుందనుకున్న భారత్ బౌలింగ్ లో మంచి ప్రదర్శనే కనబరిచింది. ఐర్లాండ్ బ్యాటర్లను టీమిండియా పేసర్లు ముప్పుతిప్పులు పెట్టారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు.
భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో ఐర్లాండ్ బ్యాటింగ్ లైనప్ భారీ స్కోరు చేయలేకపోయింది, ముఖ్యంగా అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐర్లాండ్ ను దెబ్బకొట్టాడు. పవర్ప్లే ముగిసే సమయానికి ఐర్లాండ్ 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.అయితే తన 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతున్న ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.టెక్టర్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 53 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసిన బౌలర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఐర్లాండ్ 154 రన్స్ కే పరిమితమైంది. తర్వాత ఛేజింగ్ లో ఐర్లాండ్ బౌలర్లు భారత్ కు షాకిచ్చారు.
ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లను డకౌట్ చేశారు. కాసేపటికే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఔటవడంతో టీమిండియా పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ ఆచితూచి ఆడారు. ఐదో వికెట్ కు 39 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ ఔటైన తర్వాత తిలక్ , దూబే ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరి పార్టనర్ షిప్ మ్యాచ్ గెలవడంపై ఆశలు రేకెత్తాయి. కానీ చివర్లో ఐర్లాండ్ బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టారు. తిలక్ వర్మ 55 పరుగులకు వెనుదిరిగాడు. చివర్లో హర్షిత్ రాణా భారీ షాట్ల కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆఖరి ఓవర్లో హర్షిత్ రాణా ఔటవడం, ప్రిన్స్ యాదవ్ చివరి బంతిని సిక్సర్ గా కొట్టినా ఐర్లాండ్ 1 పరుగు తేడాతో గెలిచింది.