బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనా పర్యటన మొత్తం భారత్ లక్ష్యంగానే సాగింది. దాదాపు ప్రతీ ఒప్పందమూ మన భద్రతను సవాలు చేసే లక్ష్యంతోనే జరిగింది. తారిఖ్ రెహమానే ఇంత సానుకూలంగా వ్యవహరిస్తే.. జిన్పింగ్ మాత్రం ఎందుకు తగ్గుతాడు. పనిలో పనిగా బంగ్లాదేశ్- మయన్మార్-చైనా ఎకనామిక్ కారిడార్ను ప్రతిపాదించాడు. ఈ కారిడార్ ప్రాంతీయ పెట్టుబడులు, వాణిజ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త ద్వారాలను తెరుస్తుందని బంగ్లా ప్రధానమంత్రి జబ్బలు చరుచుకున్నాడు కూడా. బంగ్లాదేశ్ ప్రధాని బీజింగ్ పర్యటనలో మొత్తం 17 అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. వాటిలో ఒక్క డీల్ భారత్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అందుకు కారణం ఒకప్పుడు భారత్తో చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి మరీ చైనాతో చేసుకోవడమే.
తారిఖ్ రెహమాన్ చైనా పర్యటన నేపథ్యంలో జిన్పింగ్ సర్కార్ అధికంగా దృష్టి పెట్టింది బంగ్లాదేశ్ పోర్టులపైనే. ఎందుకంటే, ఆ దేశ పోర్టులను సొంతం చేసుకుంటే భారత్ను ఈజీగా టార్గెట్ చేయొచ్చు. ఈ క్రమంలోనే చిట్టగాంగ్ ఓడరేవును మరింత ఆధునికీకరించేందుకు బీజింగ్ ఆసక్తి చూపిందని బంగ్లాదేశ్ ప్రకటించింది. ఆ తర్వాతే బంగ్లాలోని మొంగ్లా ఓడరేవును మరింత సమర్థంగా, సేవా ఆధారితంగా మార్చడానికి వీలుగా దానిని ఆధునికీకరించడానికి కూడా చర్చలు జరిగాయని వెల్లడించింది. చాలా కాలంగా అభివృద్ధి పేరుతో భారత పోరుగు దేశాల పోర్టులను చైనా హస్తగతం చేసుకుంటోంది. పాకిస్తాన్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్టోట, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ ఇలాగే సొంతం చేసుకుంది. ఈ మూడు పోర్టులూ ఇప్పుడు బీజింగ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కీలక పోర్టు చేరబోతోంది.
..బంగ్లాదేశ్లోని రెండో అతిపెద్ద ఓడ రేవు ఇది. 2015లో షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో మోంగ్లా పోర్ట్ పక్కన ఉన్న 110 ఎకరాల భూమిని "ఇండియన్ ఎకనామిక్ జోన్" కోసం కేటాయించారు. అయితే, భారత్కు చెందిన డెవలపర్ నిర్ణీత సమయంలోగా పనులు ప్రారంభించలేదనే కారణంతో 2025 అక్టోబర్లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేసింది. భారత్-బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో వచ్చిన ప్రతికూలతలను ఆసరాగా చేసుకుని చైనా రంగంలోకి దిగింది. ఇప్పుడు అదే 110 ఎకరాల స్థలంలో "చైనా-బంగ్లాదేశ్ మోంగ్లా పోర్ట్ ఎకనామిక్ జోన్" అభివృద్ధి చేయనున్నారు. అంతేకాకుండా, మోంగ్లా, చిట్టగాంగ్ పోర్టుల ఆధునీకరణ బాధ్యతలను కూడా చైనాకే అప్పగిస్తున్నారు. బంగ్లాదేశ్లో చైనా ఉనికి పెరగడం, ముఖ్యంగా మోంగ్లా పోర్టుపై పట్టు సాధించడం భారతదేశ భద్రతకు, భౌగోళిక రాజకీయాలకు తీవ్ర సవాలుగా మారుతుంది. ఎందుకంటే, మోంగ్లా పోర్ట్ కోల్కతా నగరానికి కేవలం 188 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్యాపార నెపంతో చైనా అక్కడ స్థిరపడితే, భారత సరిహద్దులకు, తూర్పు నౌకాదళ కమాండ్ కదలికలపై నిఘా పెట్టడం బెజింగ్కు చాలా సులువవుతుంది.
పశ్చిమాన పాక్లోని గ్వాదర్, దక్షిణాన శ్రీలంకలోని హంబన్తోట, ఇప్పుడు తూర్పున బంగ్లాదేశ్లోని మోంగ్లా, చిట్టగాంగ్ పోర్టులు చైనా చేతికి వెళ్లడం వల్ల భారత్ను మూడు వైపులా చైనా నౌకాదళం మరింత సులభంగా ఒత్తిడిలోకి నెట్టే అవకాశం వస్తుంది. పైగా మోంగ్లా పోర్ట్ డీల్తో పాటు, ఉత్తర బంగ్లాదేశ్లోని తీస్తా నది ప్రాజెక్టును కూడా చైనాకు అప్పగించేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం భారత ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన భాగంతో కలిపే సిలిగురి కారిడార్కు అత్యంత సమీపంలో ఉంటుంది. యుద్ధ సమయంలో భారత్కు ఈ ఇరుకైన కారిడార్ అత్యంత కీలకం. బంగ్లాదేశ్ ద్వారా చైనా ఈ ప్రాంతానికి దగ్గర కావడం భారత ప్రాదేశిక సమగ్రతకు పెద్ద ముప్పు. ఇప్పటివరకు భారత్ ప్రధానంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దులపైనే దృష్టి పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో చైనా సైనిక పరికరాలు, నిఘా వ్యవస్థలు, మౌలిక వసతులు పెరిగితే, భారత్ తన తూర్పు సరిహద్దు అయిన బంగాళాఖాతంపై కూడా అదనపు సైనిక బలగాలను, నిఘాను కేటాయించాల్సి వస్తుంది. 3.5 ఫ్రంట్ వార్ అంటే ఇదే. మరి ఈ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది?
శత్రు వ్యూహాలను చిత్తు చేయడంలో భారత్ ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. చైనా 'స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్' కుట్రకు చెక్ పెడుతూ.. మన నౌకాదళం హిందూ మహాసముద్రంలో 'నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహాన్ని పటిష్టం చేస్తోంది. చైనాకు కౌంటర్గా ఇప్పటికే మయన్మార్లోని సిట్వే పోర్టును, ఓమన్లోని దుక్మ్ పోర్టును, ఇండోనేషియాలోని సబాంగ్ పోర్టును భారత్ తన వ్యూహాత్మక పరిధిలోకి తెచ్చుకుంది. అంతేకాదు, తూర్పు తీరంలో అండమాన్ నికోబార్ దీవులను అధునాతన మిలిటరీ బేస్గా మార్చడంతో పాటు, బంగాళాఖాతంలో పి-8ఐ యాంటీ-సబ్మెరైన్ ఎయిర్క్రాఫ్ట్లతో చైనా నౌకలపై 24 గంటలూ నిఘా ఉంచింది. చైనా-పాకిస్తా-బంగ్లాదేశ్ రూపంలో 3.5 ఫ్రంట్ వార్ ముప్పు పొంచి ఉన్నా.. సరిహద్దు రక్షణ, ఆర్థిక దౌత్యం, అధునాతన క్షిపణి వ్యవస్థలతో డ్రాగన్ కుట్రలను తిప్పికొట్టడానికి సరిహద్దుల్లో భారత్ సర్వసన్నద్ధంగా ఉంది.