తొలి వన్డేలో గాయం.. గిల్ రెండో మ్యాచ్ ఆడతాడా ?

ఇంగ్లండ్ తో జరిగిన తొలి వ‌న్డేలో కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ 80 ప‌రుగుల వ‌ద్ద రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచ‌రీ దిశగా సాగుతున్న గిల్‌కు కుడి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అసౌక‌ర్యంగా ఫీల‌య్యాడు. వెంటనే భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స

Post Published By: dialnews
Updated : 16 July 2026, 5:26 PM IST

ఇంగ్లండ్ తో జరిగిన తొలి వ‌న్డేలో కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ 80 ప‌రుగుల వ‌ద్ద రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచ‌రీ దిశగా సాగుతున్న గిల్‌కు కుడి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అసౌక‌ర్యంగా ఫీల‌య్యాడు. వెంటనే భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికీ నొప్పి త‌గ్గ‌క‌పోవ‌డంతో గిల్ రిటైర్డ్ హ‌ర్ట్ అయ్యి పెవిలియ‌న్ చేరాడు. ఈ స‌మ‌యంలో అత‌డు న‌డుస్తున్నంత సేపు నొప్పితో ఇబ్బంది ప‌డిన‌ట్లుగా క‌నిపించింది.నొప్పితో బాధ‌ప‌డుతున్న గిల్ రెండో వ‌న్డే ఆడుతాడా లేదా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తాజాగా గిల్ గాయానికి సంబంధించి కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది.

గాయం తీవ్ర‌తపై అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయిన‌ప్ప‌టికీ కేవ‌లం కండ‌రాలు ప‌ట్టేయ‌డంతోనే నొప్పి వ‌చ్చిన‌ట్లు బీసీసీఐ మెడికల్ టీం ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. ఇప్ప‌టికైతే గిల్ బాగానే ఉన్నాడ‌ని, రెండో వ‌న్డేలో ఆడుతాడ‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపింది. రెండో వ‌న్డేకు ఒక‌రోజు గ్యాప్ ఉండ‌డంతో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని పేర్కొంది. గిల్‌ కూడా తన గాయంపై స్పందించాడు. తాను బాగానే ఉన్నాననీ. కండరాల నొప్పితో కాస్త బాధపడినట్ట చెప్పాడు.. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్న గిల్ రెండో వన్డేకు ఫిట్‌గానే ఉంటానని చెప్పుకొచ్చాడు.

ఇక మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌లు వెనువెంట‌నే ఔటైన త‌ర్వాత గిల్‌, అయ్య‌ర్‌తో క‌లిసి బాధ్య‌త‌గా ఆడాడు. ఇద్ద‌రు క‌లిసి మూడో వికెట్‌కు 101 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. అయితే గిల్ రిటైర్డ్ హర్ట్ వెళ్లిన కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ 35 పరుగుల వద్ద రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా కేవలం ఒక్క పరుగుకే ఔటవడంతో భారత్‌పై మరోసారి ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన ఆల్ రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి ఇంగ్లాండ్ ను చిత్తు చేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఒక దశలో 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే జో రూట్, లియామ్ డాసన్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకుని 258 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించి ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.

Published : 
  • 16 July 2026, 5:26 PM IST