IND Vs NEP: టీమిండియా మ్యాచులో నేపాల్ ఆటగాళ్లకు.. బీర్ల కంపెనీ బంపర్ ఆఫర్

భారత్‌తో మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కూ రూ.లక్ష రూపాయల నజరానాను అర్ణ బీర్ కంపెనీ ప్రకటించింది. కేవలం బౌలర్లకే కాదు.. బ్యాటర్లకూ ఆఫర్ ఇచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 4 September 2023, 4:27 PM IST

IND Vs NEP: ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్‌, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. సూపర్-4 దశకు చేరాలంటే.. ఇరు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ లాంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసేందుకు నేపాల్‌కు చెందిన అర్ణ బీర్ కంపెనీ ఓ బంపరాఫర్ ప్రకటించింది.

భారత్‌తో మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కూ రూ.లక్ష రూపాయల నజరానాను అర్ణ బీర్ కంపెనీ ప్రకటించింది. కేవలం బౌలర్లకే కాదు.. బ్యాటర్లకూ ఆఫర్ ఇచ్చింది. భారత బౌలర్ల బౌలింగ్‌లో బాదే ఒక్కో సిక్సర్‌కు రూ.లక్ష బహుమతి ఇస్తానని తెలిపింది. ఫోర్ బాదితే మాత్రం రూ.25 వేలు నజరానా అందిస్తామని పేర్కొంది. మ్యాచ్ అన్నాక వికెట్ పడడం.. ఫోర్, సిక్సర్‌లు బాదడం సాధారణమే. మొత్తానికి నేపాల్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది. అయితే భారత్‌, నేపాల్ మ్యాచ్‌ పూర్తిగా జరిగే సూచనలు కనిపించడం లేదు.

భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్ లానే.. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 60-70 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ సమయానికి వర్షం పడే అశాలు పెరుగుతాయట. ఈ మ్యాచ్ కూడా భారత్-పాక్‌ మ్యాచ్ లాగే సగం మాత్రే జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వరుణుడు ఏం చేస్తాడో చూడాలి.

Published : 
  • 4 September 2023, 4:27 PM IST