టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకి తన కొడుకు అంటే ఎంతో ఇష్టం. మరోసారి తన కొడుకుపై ఎంత ప్రేమ ఉందో చాటుకున్నాడు. మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, కుమారుడు అగస్త్య పాండ్య కోసం సుమారు 4 కోట్ల విలువైన లగ్జరీ ఎస్యూవీ కారును గిఫ్ట్గా ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల్లో నటాషా, అగస్త్యతో కలిసి బ్లాక్ కలర్ లగ్జరీ కార్ పక్కన కనిపించింది. ఇది లాండ్ రోవర్ తయారు చేసిన డిఫెండర్ మోడల్గా తెలుస్తోంది. వేరియంట్, కస్టమైజేషన్ ఆధారంగా దీని ధర రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఈ ఫోటోలను కార్ డీలర్షిప్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం మరింత వైరల్ అయింది. నమ్మకంతో కూడిన బంధం.. అత్యుత్తమ నిర్ణయం అంటూ క్యాప్షన్ కూడా జత చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.హార్దిక్, నటాషా 2024లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ, కుమారుడు అగస్త్య విషయంలో ఇద్దరూ ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. చదువు, ఆరోగ్యం, భవిష్యత్ వంటి అంశాల్లో ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఆదర్శ కో-పేరెంట్స్గా నిలుస్తున్నారు. హార్దిక్ తిరిక లేని షెడ్యూల్లో ఉన్నా, కొడుకుతో సమయం గడపటానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాడు.
ఈ ఖరీదైన కార్ గిఫ్ట్ కూడా కొడుకుపై హార్ధిక్కు ఉన్న ప్రేమకు నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు.ఇటీవల హార్దిక్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. మోడల్ మహీకా శర్మతో హార్దిక్ రిలేషన్లో ఉన్నాడు. అయితే, ఎన్ని మార్పులు వచ్చినా అగస్త్యనే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని హార్దిక్ స్పష్టం చేస్తున్నాడు. మరోవైపు నటాషా కూడా ఫిట్నెస్, కెరీర్పై దృష్టి పెట్టింది. ఇక ప్రొఫెషనల్ కెరీర్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్య ప్రస్తుతం టీమిండియా తరఫున టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నాడు. పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో తొలి ఓవర్లోనే వికెట్ తీసిన హార్దిక్ భారత్కు శుభారంభాన్ని అందించాడు. సూపర్-8 దశలో భారత్ విజయాలు సాధించడంలో ఈ ఆల్రౌండర్ పాత్ర మరింత కీలకం కానుంది.