ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ టీ20 క్రికెట్లో ఓ అరుదైన ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యాడు.ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ టీ20 కెరీర్లో మొత్తం 99 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. మరో ఒక్క సిక్సర్ బాదితే టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ పేరిట ఉంది. పొలార్డ్ 843 బంతుల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకోగా.. వైభవ్ సూర్యవంశీ కేవలం 511 బంతుల్లోనే 99 సిక్సర్లకు చేరుకొన్నాడు. పొలార్డ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ భారీ తేడాతో తుడిచిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ దిగ్గజ బౌలర్లను వణికిస్తున్నాడు. గత సీజన్లో 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ యువ సంచలనం.. తన తొలి బంతికే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో సిక్సర్ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్లో తను కోరుకున్నట్లుగానే జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్గా మలిచి సత్తా చాటాడు. అలాగే ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ వంటి అంతర్జాతీయ స్టార్ బౌలర్ల బౌలింగ్లో కూడా సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు.
మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లోనే వైభవ్ సూర్యవంశీ మరో రెండు అద్భుతమైన మైలురాళ్లను అందుకున్నాడు. కేవలం 15 ఏళ్ల 29 రోజుల వయసులోనే టీ20 క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. గతేడాది గుజరాత్ టైటాన్స్పై 35 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్.. భారత ఆటగాళ్లలో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును ఇప్పటికే తన పేరిట లిఖించుకున్నాడు.