ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో గాయపడ్డ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ అప్డేట్ వచ్చేసింది. కండరాలు పట్టేయడంతో అతడు.. మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. అయితే మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ.. స్కానింగ్ చేయించుకున్నాడు. ఇందులో ఎలాంటి చీలక రాలేదని తేలినట్లు సమాచారం. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. నిజానికి గాయమైన తర్వాత రోహిత్.. ఐపీఎల్ 2026లో కొన్ని మ్యాచ్లకు దూరమవుతాడని ప్రచారం జరిగింది. కానీ అదంతా కేవలం ప్రచారం మాత్రమే అని తేలింది.
రోహిత్ శర్మ గాయం మరీ పెద్దదేమీ కాదని స్కానింగ్ రిపోర్ట్లో తేలింది. కేవలం కండరాలు పట్టేయడంతోనే అతడు మైదానాన్ని వీడినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. అయితే గురువారం పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ ఆడే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. అవసరమైతే ముందు జాగ్రత్తగా ఈ ఒక్క మ్యాచ్కు అతడికి విశ్రాంతి ఇవ్వొచ్చు. అలా కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా బరిలోకి దించే అవకాశం ఉంది.
ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2026లో ఎదురీదుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒకే విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల తర్వాత సీజన్లో తమ తొలి మ్యాచ్లో గెలిచిన ముంబై.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా బౌలింగ్ వైఫల్యం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడినప్పటికీ.. ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బౌల్ట్ కూడా ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపించట్లేదు.