టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కివీస్ వేటగాళ్లు రికార్డు స్థాయిలో ఛేదించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కివీస్ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఇన్నింగ్స్ నిలకడగా సాగుతున్న సమయంలో ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ , ఇబ్రహీం జద్రాన్ తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. పవర్ప్లే ముగిసే సమయానికి ఆఫ్ఘన్ జట్టు 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మూడో స్థానంలో వచ్చిన గుల్బదిన్ నైబ్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా సెదికుల్లా అటల్ బాధ్యతాయుతంగా ఆడటంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు రెండో ఓవర్లోనే ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ చుక్కలు చూపించాడు. వరుస బంతుల్లో ఫిన్ అలెన్ , రచిన్ రవీంద్ర లను అవుట్ చేసి కివీస్ను దెబ్బ కొట్టాడు. ఈ దశలో టిమ్ సిఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ జోడి ఆడుకుంది. సీఫెర్ట్ కేవలం 42 బంతుల్లో 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫిలిప్స్ కూడా 25 బంతుల్లో 42 పరుగులతో మెరుపులు మెరిపించడంతో కివీస్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. వీరిద్దరూ మూడో వికెట్కు 74 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్, ముజీబ్లు వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచినప్పటికీ, కివీస్ బ్యాటర్లు ఏమాత్రం తగ్గలేదు. మార్క్ చాప్మన్ విలువైన పరుగులు జోడించగా.. చివర్లో డారిల్ మిచెల్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ధాటిగా ఆడటంతో కివీస్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో 175 కంటే ఎక్కువ పరుగులు చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అలాగే ఆఫ్ఘన్పై టీ20ల్లో ఇదే అత్యంత విజయవంతమైన రన్ చేజ్ గా రికార్డులకు ఎక్కింది.