ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ సూర్య వంశీ గురించి మొన్నటిదాకా అందరూ గొప్పగా మాట్లాడారు. 15 ఏళ్లకే అతడు ఆడుతున్న తీరు అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో ప్రశంసలు కురిపించారు. దూకుడుగా బ్యాటింగ్ చేయడం.. వేగంగా పరుగులు తీయడంతో అతడి గురించి అందరూ చర్చించుకున్నారు. చివరికి భారత జాతీయ జట్టులోకి కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, అతని ఆట తీరు ఇప్పుడు అంత గొప్పగా సాగడం లేదు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో డకౌటైన అతడు.. ఆ తదుపరి మ్యాచ్ లలో కూడా అదే తీరుగా ఆడుతున్నాడు. హైదరాబాద్ పై ఖాతా కూడా తెరవకుండానే ఔటైన సూర్యవంశీ.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 46 పరుగులు చేశాడు.
నాలుగు పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. కానీ లక్నో జట్టుతో మ్యాచ్లో సూర్య వంశీ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. 11 బంతులు ఎదుర్కొన్న అతడు.. రెండు బౌండరీల సహాయంతో ఎనిమిది పరుగులు చేశాడు. మోసిన్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. అతడు కొట్టిన బంతిని దిగ్వేష్ రాటి అద్భుతంగా అందుకున్నాడు. దీంతో సూర్యవంశీ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.ఇటీవల వైభవ్ సూర్యవంశీ ఆట తీరు గురించి రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.. సునీల్ గవాస్కర్ కూడా అదే విధంగా మాట్లాడాడు.. వారు మాట్లాడిన మాటల తీరు గానే సూర్య వంశీ ఆటతీరు కొనసాగుతోంది.
లెగ్ సైడ్ వచ్చిన బంతులను గట్టిగా ఆడుతున్న సూర్యవంశీ.. హాఫ్ సైడ్.. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోతున్నాడు.. బుధవారం నాటి మ్యాచ్ లో షార్ట్ పిచ్ బంతిని ఎదుర్కునే క్రమంలో సూర్య వంశీ వికెట్ పారేసుకున్నాడు.సూర్య వంశీ మొదట్లో తను లోపాలను అంతగా కనిపించనీయలేదు. ఎప్పుడైతే అతని ఆట తీరు మీద హైదరాబాద్ బౌలర్లు ప్రధానంగా దృష్టి పెట్టారో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో సత్తా చూపించిన సూర్య వంశీ.. లక్నో జట్టుతో మ్యాచ్ లో విఫలమయ్యాడు. పంత్ ప్రత్యేకంగా స్కెచ్ వేసి.. సూర్య వంశీని పెవిలియన్ కు పంపాడు. దీంతో తన వీక్ నెస్ ను అధిగమించడంపై వైభవ్ ఫోకస్ పెట్టాలని మాజీలు సూచిస్తున్నారు.