Wife Suicide: భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య కన్నీరు పెట్టిస్తోన్న ఘటన

భర్తలేని ప్రపంచం భారంగా కనిపించింది. బతుకు లేదేమో అనిపించింది. ఏడడుగులు కలిసిన నడిచిన భార్య.. మరణంలోనూ భర్తతో అడుగులు వేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ప్రతీ ఒక్కరి మనసు మెలేస్తోంది. కట్టుకున్న భర్త అకాల మరణం.. ఆ మహిళను తీవ్ర మనోవేదనకు గురి చేసింది.

Post Published By: Srikar Creator
Updated : 25 May 2023, 7:30 PM IST

భర్తలేని ఈ లోకంలో తాను ఎందుకని తనువు చాలించింది. ఈ హృదయ విదారకఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకుంది. రోజుల వ్యవధిలోనే రెండు మరణాలు చూసిన వారి కుటుంబ సభ్యుల కన్నీటిని ఓదార్చే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఎవరు ! అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితికి.. వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మనోజ్‌తో ఏడాది కింద వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు ఇద్దరూ.. అమెరికా వెళ్లిపోయారు. మనోజ్‌ డల్లాస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 2న తల్లిదండ్రులను చూసేందుకు.. హైదరాబాద్ వచ్చింది సాహితి. అదే సమయంలో అమెరికాలో ఉన్న ఆమె భర్త మనోజ్‌.. గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.

భర్త మరణవార్త తెలిసినప్పటి నుంచి సాహితి తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ నెల 23న మనోజ్‌ భౌతికకాయాన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. భర్త మృతదేహాన్ని చూసిన సాహితి తీవ్ర విచారంలో మునిగిపోయింది. మనోజ్‌ అంత్యక్రియలు ముగిసిన తర్వాత... అంబర్‌పేటలోని పుట్టింటికి వెళ్లిపోయింది సాహితి. అప్పటి నుంచి ఎవరితో కలవకుండా దూరంగా ఉన్న సాహితి.. ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని సాహితి సూసైడ్‌ చేసుకుంది. సాహితి తీరు చూసి అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు.. ఆమె చెల్లి సంజనను తోడుగా ఉంచారు. ఐతే పది నిమిషాలు సంజన అలా బయటకు వెళ్లిందో లేదో.. ఇలా సూసైడ్ చేసుకుంది సాహితి. ఒకే కుటుంబంలో వరుసగా రెండు మరణాలు చోటుచేసుకోవడంతో.. ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Published : 
  • 25 May 2023, 7:30 PM IST