Janasena: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన పరిస్థితేంటి ? సర్వే బయటపెట్టిన సంచలన నిజాలు..

ఏపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ముందస్తు అన్న ప్రచారం సాగుతున్న వేళ.. పార్టీలన్నీ దూకుడు పెంచాయ్. టీడీపీ, జనసేన పొత్తులు దాదాపు కన్ఫార్మ్ అనిపిస్తున్నా.. తనను సీఎం చేయాలంటూ పవన్ పదేపదే చెప్తుండడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది. దీంతో జనసేన బలం ఏంటి.. పవన్ వ్యాఖ్యలు ఏంటని లెక్కలు తీసే పనిలో పడ్డారు జనాలు.

Post Published By: Srikar Creator
Updated : 7 July 2023, 7:15 PM IST

ఐతే ఇప్పుడో సర్వే సంచలన నిజాలు బయటపెట్టింది. జనసేన వర్గాలకు ఇది జోష్ నింపుతుంటే.. టీడీపీ నేతలకు టెన్షన్‌ పెడుతోంది. 2019 ఎన్నికల్లో 146 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన.. మిగతా స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఐతే ఆ ఎన్నికల్లో జనసేన భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం ఒక్క సీటులో మాత్రమే విజయం సాధించింది. గెలిచిన ఎమ్మెల్యే కూడా రెబల్‌గా మారి.. వైసీపీతో సన్నిహితంగా ఉండడం స్టార్ట్ చేశారు. దీంతో ఆ ఒక్క స్థానం కూడా ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేని స్థితికి పడిపోయింది జనసేన.

ఇదంతా ఎలా ఉన్నా.. ఓటింగ్‌పరంగా మొదటి ప్రయత్నంలోనే 7.5శాతం ఓట్లు సాధించింది జనసేన. నాలుగేళ్లుగా వైసీపీ మీద జనసేన గట్టి పోరాటమే చేసింది. కౌలు రైతులకు మద్దతుగా నిలవడమే కాకుండా.. ఎస్సీ, ఎస్టీలకు అండగా ముందుండి నిరసనలకు నాయకత్వం వహించారు పవన్‌. ఇక కాపులు కూడా జనసేనను ఓన్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య జనసేన గ్రాఫ్‌ భారీగా పెరిగిందని సర్వేలు చెప్తున్నాయ్. కొన్ని స్వతంత్ర సంస్థలు.. ఏపీలో సర్వేలు నిర్వహించాయ్‌. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మెజారిటీ వస్తుందో అంచనా వేశాయ్.

ఈ సర్వేల్లో జనసేన ఓట్ల శాతం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉద్యోగులు, మధ్యతరగతి జనాలు.. జనసేనకు ఓటు వేయడానికి అనుకూలంగా ఉన్నారని సర్వేలు అంచనా వేస్తున్నాయి. మేజర్లుగా మారిన యువకులు, ఓటు వేయడానికి అర్హులు. గతంలో ఓటు వేయని వారు జనసేనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ చరిష్మా, సుపరిపాలన కోసం అతని హామీపై ఆధారపడింది. ఈ సర్వేలను పరిశీలిస్తే, గత ప్రయత్నం కంటే జనసేన ఓట్ల శాతం పెరగబోతున్నట్లు స్పష్టమవుతోంది. మునుపటి ఎన్నికల ఓట్ షేర్‌తో కలిపితే, జనసేన మొత్తం ఓట్ షేర్ రెండంకెలు అంటే 10 శాతానికి చేరుకోవచ్చని సర్వేలు చెప్తున్నాయ్.

Published : 
  • 7 July 2023, 7:15 PM IST