Yarlagadda Venkat Rao: యార్లగడ్డకు టీడీపీ టికెట్ ఖాయమా..? జగన్ మీద పంతం నెరవేరడం సాధ్యమేనా..?

గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. అసెంబ్లీలో జగన్‌ను కలుసుకుంటానని యార్లగడ్డ సవాల్‌ విసిరారు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా.. టీడీపీలోకి వెళ్లి బరిలోకి దిగుతారా అనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వంశీ.. యార్లగడ్డ మీద విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీకి జైకొట్టారు.

Post Published By: narender Thiru
Updated : 18 August 2023, 7:07 PM IST

Yarlagadda Venkat Rao: గన్నవరం వైసీపీ పంచాయితీ క్లైమాక్స్‌కు వచ్చింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావ్ మధ్య ఒకేపార్టీలో పోరుకు దాదాపు ఎండ్ కార్డ్‌ పడింది. వంశీకి వైసీపీ సీటు ఖాయం కావడంతో.. యార్లగడ్డ ఫైనల్‌గా తన అనుచరులతో భేటీ అయ్యారు. తడి గుడ్డతో తన గొంతు కోశారని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. అసెంబ్లీలో జగన్‌ను కలుసుకుంటానని యార్లగడ్డ సవాల్‌ విసిరారు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా.. టీడీపీలోకి వెళ్లి బరిలోకి దిగుతారా అనే చర్చ జరుగుతోంది.

గత ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ నుంచి పోటీ చేసిన వంశీ.. యార్లగడ్డ మీద విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీకి జైకొట్టారు. దీంతో ఫ్యాన్ పార్టీలో యార్లగడ్డకు ప్రాధాన్యం లేకుండా పోయింది. మధ్యలో కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ పదవి ఇచ్చి మళ్లీ తీసేశారు. గన్నవరం వైసీపీ సీటు వంశీకి ఫిక్స్ చేశారు. దీంతో యార్లగడ్డ తన అనుచరులతో సమావేశమై.. వంశీ కారణంగా అసలైన వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరగలేదని వాపోయారు. తనకు సీటు ఇవ్వాలని జగన్‌ని కోరారు. విజయవాడకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి.. యార్లగడ్డ పార్టీ మారితే నష్టమేమీ లేదని, ఆయన పార్టీ మారతారో లేదో ఆయన ఇష్టమని తేల్చి చెప్పేశారు. తాను టికెట్ కావాలని అడిగితే పార్టీ పెద్దలకు ఏం అర్థం అయిందో తెలియటం లేదని, వైఎస్ ఉంటే తనకు ఇలా జరిగేది కాదని, తడిగుడ్డతో గొంతు కోశారని వాపోయారు. దీంతో యార్లగడ్డ వైసీపీని వీడటం ఖాయమైంది. చంద్రబాబుని కలుస్తానని, అపాయింట్మెంట్ అడిగానని యార్లగడ్డ చెప్పుకొచ్చారు.

దీంతో యార్లగడ్డ టీడీపీలో చేరడం ఖాయమైంది. మరో రెండు రోజుల్లో గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఉంది. భారీ సభ కూడా జరగబోతోంది. అప్పుడు యార్లగడ్డ టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఎలాగో గన్నవరం టీడీపీ సీటు ఖాళీగా ఉంది. యార్లగడ్డ చేరితే ఆయనకే టికెట్ ఖాయం. పైగా వంశీకి సరైన ప్రత్యర్ధి. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉంది. వైసీపీ నుంచి వంశీ, టీడీపీ నుంచి యార్లగడ్డ బరిలో దిగితే.. గన్నవరం పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయం.

 

Published : 
  • 18 August 2023, 7:07 PM IST