Revanth Reddy: కేసీఆర్‌ది దింపుడు కళ్లం ఆశ.. సాగర్ వివాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఇన్నాళ్లు లేని సాగర్ సమస్య ఇప్పుడే గుర్తొంచ్చిందా? సాగర్ వివాదాన్ని వ్యూహాత్మకంగా సృష్టించారు. సాగర్ ప్రాజెక్టు ఎక్కడికి పోదు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టుతో పాటు దాని గేట్లు అక్కడే ఉంటాయి.

Post Published By: narender Thiru
Updated : 30 November 2023, 12:28 PM IST

Revanth Reddy: నాగార్జున సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య తలెత్తిన వివాదంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల మధ్య లేని వివాదం, ఎన్నికల రోజే ఎందుకు జరిగిందని ప్రశ్నించారు రేవంత్. కేసీఆర్ కుట్రలో భాగంగానే నాగార్జున సాగర్ వివాదం మొదలైందని రేవంత్ ఆరోపించారు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి గురువారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. "తెలంగాణలో ఇన్నాళ్లు లేని సాగర్ సమస్య ఇప్పుడే గుర్తొంచ్చిందా? సాగర్ వివాదాన్ని వ్యూహాత్మకంగా సృష్టించారు. సాగర్ ప్రాజెక్టు ఎక్కడికి పోదు.

ASSEMBLY ELECTIONS: నెమ్మదిగా సాగుతున్న ఓటింగ్.. ఇంకా పాతిక శాతం కూడా దాటలే..!

తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టుతో పాటు దాని గేట్లు అక్కడే ఉంటాయి. పోలింగ్‌కు ముందు ఇలాంటి అంశాలను తెర లేపడానికి ఎవరు, ఎందుకు, ఏమి ఆశించి చేస్తున్నారో ప్రజలకు తెలుసు. అవసరమైనపుడు సెంటిమెంట్‌గా రాజకీయాలకు ఉపయోగించుకునేలా పన్నాగాలు పన్నుతున్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. కేసీఆర్‌ వెళ్లిపోయే సిఎం. ఆయనకు వ్యక్తిగత ఆసక్తులు తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. కేసీఆర్ ఆఖరి ప్రయత్నంగా, దింపుడు కళ్ళం ఆశలుగా ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారు. రెండు దేశాలే నీటి సమస్య పరిష్కరించుకుంటున్నప్పుడు.. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం సాధ్యం కాదా..? తొమ్మిదిన్నరేళ్లుగా సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి ఘర్షణలు తలెత్తుతున్నాయి. సాగర్ వివాదంపై ఈసీ సీఈవో చర్యలు తీసుకోవాలి. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

రానున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీతో సామరస్యంగా నదీ జలాల వివాదాలను పరిష్కరించుకుంటాం. కృష్ణా, గోదావరి జలాల వివాదాలతో పాటు ఆస్తుల వివాదాలను కూడా ఏపీతో పరిష్కరించుకుంటాం. పాకిస్తాన్‌తో వివాదాలే పరిష్కారం అవుతున్నాయి.. అలాంటప్పుడు రాష్ట్రాల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కుట్రల్లో పడొద్దు. ఇలాంటి కుట్రల్లో తెలంగాణ ప్రజలు చిక్కుకోవద్దు. ప్రజలు ఎన్నుకున్న రెండు ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపిస్తాయి.

Published : 
  • 30 November 2023, 12:28 PM IST