అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విశ్వరూపమే చూపించాడు. ఫైనల్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సూపర్ సెంచరీతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. యంగ్ ఇండియా భారీ స్కోర్ చేయడంలో, ఇంగ్లాండ్ను 100 పరుగుల తేడాతో ఓడించి 6వ ప్రపంచ టైటిల్ను గెలుచుకోవడంలో వైభవ్ సూర్యవంశీ కీలకపాత్ర పోషించాడు. ఇక, అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ హిస్టరీ క్రియేట్ చేశాడు. అంతేకాదు అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ లో అత్యంత వేగంగా శతకం చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు.
ఐపీఎల్ లోనూ సెంచరీ బాదిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డ్ ఉంది. 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్స్ సాధించాడు. ఈ విధ్వంసకర ప్రదర్శనతో సీనియర్ ఇండియా మెన్స్ టీమ్ లోకి వైభవ్ ని తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా పెరిగింది.యూత్ క్రికెట్లో దాదాపు ప్రతి బ్యాటింగ్ రికార్డ్ ను వైభవ్ అందుకున్నాడు. ఇక మిగిలింది 200 పరుగులు చేయడమే. ఇప్పుడే ఇలా చెలరేగిపోతుంటే 19 ఏళ్ల వయసులో అతడు ఎలాంటి సంచలనాలు నమోదు చేయగలడో అనేది ఆలోచించడానికే భయంగా ఉంది. అయితే, అర్హత ఉన్నా.. వైభవ్ సూర్యవంశీ నెక్ట్స్ రెండు అండర్ 19 వరల్డ్ కప్ లలో పాల్గొనలేడు. ఎందుకు అంటే.. 2028లో తదుపరి U19 ప్రపంచ కప్ వచ్చే సమయానికి, సూర్యవంశీకి 16 ఏళ్లు వస్తాయి.
2030 నాటికి అతనికి 18 ఏళ్లు నిండుతాయి. కానీ, అతను వీటిలో ఆడలేడు. ఫామ్ లేకపోవడమో ఎంపిక కాకపోవడమో దీనికి కారణం కాదు. అతనే కాదు అతడి సహచరులకు కూడా ఆ అవకాశం లేదు దీనికి కారణం బీసీసీఐ గైడ్ లైన్స్. బోర్డ్ ప్రోటోకాల్స్ ప్రకారం, ఒక భారతీయ క్రికెటర్ U19 ప్రపంచ కప్లో ఒకే ఎడిషన్లో పాల్గొనచ్చు. 2016లో BCCI ఆటగాళ్లను ఒకటి కంటే ఎక్కువ U19 ప్రపంచ కప్లు ఆడకుండా నిషేధించినప్పుడు ఈ రూల్ అమల్లోకి వచ్చింది. దీనికి ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.2016లో, రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ వ్యవస్థలోని వయసు మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత బీసీసీఐ ఈ నిబంధన తీసుకొచ్చింది.