వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో...విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి ? జగన్మోహన్రెడ్డి, షర్మిలా రెడ్డి గొడవలు కారణాలు ఏంటి ? షర్మిల చెబుతున్నట్లు ఆస్తి పంపకాలే...ఇద్ధరి మధ్య చిచ్చు రాజేసిందా ? లేదంటే షర్మిలకు, వైఎస్ భారతిరెడ్డికి పడటం లేదా ? అసలు గొడవ అన్నాచెల్లెళ్ల మధ్య కాదా ? వదినతో మరదలకి ఎక్కడ బెడిసి కొట్టింది ? ఇప్పుడిదే హాట్టాపిక్గా మారింది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ఆస్తుల వ్యవహారం...మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు అన్న జగన్మోహన్రెడ్డి ఆస్తులు పంపకాలు చేయడం లేదంటూ షర్మిలా రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే అసలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. విభేదాలు ఉన్నది షర్మిల, భారతిరెడ్డి మధ్య మాత్రమే.
సాక్షి సంస్థల్లో షర్మిలకి వాటా ఇవ్వడానికి భారతిరెడ్డి నిరాకరించారు. అక్కడి నుంచి షర్మిల, భారతిరెడ్డి మధ్య వివాదం షురూ అయింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదలాయింపు విషయంలో...భారతిరెడ్డి న్యాయస్థానం మెట్లెక్కారు. జగన్ సతీమణి వైఎస్ భారతి ఈ వ్యవహారంలో నేరుగా రంగంలోకి దిగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ...భారతి రెడ్డి పేరు మీద ఉన్న షేర్ల వ్యవహారం అత్యంత కీలకంగా మారింది. తన వ్యక్తిగత ఆస్తుల విషయంలో షర్మిల జోక్యం చేసుకోవడంపై భారతి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అత్యున్నత స్థాయిలో న్యాయపోరాటానికి సిద్ధమవ్వడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. 2019లో జరిగిన ఎంఓయూ ప్రకారం కొన్ని ఆస్తులను షర్మిలకు ఇవ్వాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, షర్మిల తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
షర్మిల, భారతి మధ్య వివాదానికి అసలు కారణం...సరస్వతి పవర్ ఇండస్ట్రీస్లో షేర్ల బదలాయింపుపై జగన్ సతీమణి సీరియస్గా ఉన్నారు. తన అనుమతి లేకుండా ఫోర్జరీ లేదా అక్రమ పద్ధతుల్లో షేర్లను... షర్మిల, విజయమ్మ పేర్ల మీదకు మార్చుకున్నారని జగన్, ఆయన సతీమణి భారతి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. అయితే భారతి వాదనలను షర్మిల ఖండిస్తున్నారు. రాజశేఖర రెడ్డి ఆశయం ప్రకారం కుటుంబ ఆస్తులన్నీ మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని చెబుతున్నారు. కానీ జగన్ కేవలం ప్రేమతో ఇచ్చే బహుమతిగా వీటిని చిత్రీకరించడంపై షర్మిల మండిపడుతున్నారు. ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు సర్వసాధారణమే అయినా, రాష్ట్రం గర్వించే కుటుంబంలో ఇలా బహిరంగంగా కోర్టుల చుట్టూ తిరగడం వైఎస్సార్ అభిమానులను కలవరపెడుతోంది.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కు చెందిన వాటాలను విజయమ్మ పేరుతో బదలాయించింది. ఇది జరిగిన చాలా కాలం తర్వాత ఈడీ ఆస్తుల్ని జప్తు చేసింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ ఎన్సీఎల్ఏటీకి నివేదించింది. విజయమ్మ పేరుతో వాటాల బదిలీకి ముందు ఎలాంటి దశలోనూ అందుకు అనుమతించొద్దని వైఎస్ జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీలు కంపెనీకి లిఖితపూర్వక సమాచారమివ్వలేదని తెలియజేసింది. వైఎస్ జగన్, విజయమ్మ మధ్య కుదిరిన అవగాహన మేరకే ఆమెకు వాటాల బదిలీ జరిగి హక్కులు సంక్రమించాయని వెల్లడించింది. విజయమ్మకు వాటాల బదిలీకి సంబంధించి చట్టబద్ధమైన పత్రాలున్నాయన్నది నిర్వివాద వాస్తవమని, వాటాల బదిలీకి ఎలాంటి అడ్డంకులూ లేవని స్పష్టం చేసింది.
అయితే విజయమ్మ, చాగరి జనార్దన్రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానించడంపై జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ కంపెనీలు...హైదరాబాద్ ఎన్సీఎల్ఏటీలో గతంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ఎన్సీఎల్ఏటీ...వాటాల బదలాయింపును రద్దు చేసింది. అంతేకాకుండా జగన్, భారతి, క్లాసిక్రియాల్టీల పేర్లను పునరుద్ధరించాలంటూ...గతేడాది జులై 29న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలంటూ ...చెన్నై ఎన్సీఎల్ఏటీలో సరస్వతి పవర్ లిమిటెడ్, విజయమ్మ వేర్వేరుగా అప్పీళ్లు వేశారు. ఈ అప్పీళ్లలో వైఎస్ జగన్ తదితరులు కౌంటర్ వేస్తూ పలు ఆరోపణలు చేశారు. వాటిని తిప్పికొడుతూ ఇటీవల సరస్వతి పవర్ రిప్లై కౌంటర్ దాఖలు చేసింది. అప్పీల్ వేసే అర్హత కంపెనీకి లేదనడం సరికాదని తేల్చిచెప్పింది. రిజిస్టర్లో వాటాల బదిలీ మార్పునకు సంబంధించి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న తీర్మానాలను, వాటాల బదిలీకి అనుసరించిన విధానాన్ని ఎన్సీఎల్టీ తప్పుపట్టింది.