ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలస్తీనా సాయుధ సంస్థ అయిన హమాస్ను ఇజ్రాయెల్ సేనలు కోలుకోలేని భారీ దెబ్బ తీశాయి. హమాస్ నూతన మిలిటరీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ఒడెహ్ను ఇజ్రాయెల్ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ధృవీకరించారు. హమాస్ అధినాయకత్వాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఇజ్రాయెల్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదీ ఒకటి.
మహమ్మద్ ఒడెహ్ మరణం హమాస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అతను మిలిటరీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన కేవలం 11 రోజుల్లోనే ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఉన్న కీలక నేతలు వరుసగా హతమైన తర్వాత, హమాస్ సైనిక కార్యకలాపాలను ముందుకు నడిపించే అత్యంత కీలకమైన బాధ్యతను ఒడెహ్ భుజాన వేసుకున్నాడు. కానీ, అతడి కదలికలపై పక్కా నిఘా ఉంచిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్.. అత్యంత పకడ్బందీగా దాడి చేసి అతడిని అంతమొందించింది. కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఒక అత్యున్నత స్థాయి కమాండర్ను కోల్పోవడం హమాస్ సంస్థ సైనికుల ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
మహమ్మద్ ఒడెహ్ ఇజ్రాయెల్ 'మోస్ట్ వాంటెడ్' లిస్ట్లో ఉండటానికి ఒక బలమైన కారణం ఉంది. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడి జరిగింది. ఆ రోజున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి వేలాది మంది అమాయక పౌరులపై ఊచకోతకు పాల్పడ్డారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మందిని బందీలుగా గాజా స్ట్రిప్కు తీసుకెళ్లారు. ఆనాటి రక్తపాతానికి మరియు దాడుల వ్యూహరచనలో మహమ్మద్ ఒడెహ్ అత్యంత కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ వర్గాలు ఆధారాలతో సహా గుర్తించాయి. అప్పటి నుంచే అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ సైన్యం.. తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టి చివరకు అతడిని మట్టుబెట్టింది.
అక్టోబర్ 7 దాడులకు కారణమైన ప్రతి ఒక్కరినీ, ముఖ్యంగా హమాస్ అగ్రనేతలను ఏరివేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని గతంలోనే శపథం చేశారు. తాజా ఆపరేషన్తో ఆ దిశగా ఇజ్రాయెల్ తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోందని స్పష్టమవుతోంది. మహమ్మద్ ఒడెహ్ హతం కావడం.. ఈ సుదీర్ఘ యుద్ధంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారింది. నాయకత్వ లేమితో సతమతమవుతున్న హమాస్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఈ పరిణామం పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారుస్తుందా లేక కాల్పుల విరమణ ఒప్పందాలకు దారి తీస్తుందా అనేది సస్పెన్స్గా మారింది.