ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు ముందు భారత జట్టుకు శుభవార్త అందింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడానికి పూర్తిగా సిద్ధమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షను కోహ్లీ విజయవంతంగా పూర్తి చేశాడు. త్వరలోనే వన్డే సిరీస్ కోసం లండన్కు బయలుదేరనున్నట్లు సమాచారం. మాజీ భారత కెప్టెన్ కోహ్లీని వచ్చే నెల ఇంగ్లాండ్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఎంపిక చేసినప్పటికీ, ఆయన అందుబాటు ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంది. ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కోహ్లీ హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. దీంతో కోహ్లీ తిరిగి జట్టులో చేరడం వైద్య బృందం అనుమతిపై ఆధారపడింది.
తాజా సమాచారం ప్రకారం కోహ్లీ అవసరమైన అన్ని ఫిట్నెస్ పరీక్షలను పూర్తి చేశాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి అధికారిక అనుమతి కూడా త్వరలోనే లభించే అవకాశం ఉంది. ఎలాంటి అనుకోని సమస్యలు తలెత్తకపోతే, 37 ఏళ్ల కోహ్లీ జూలై 14 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటాడు.కోహ్లీ పునరాగమనం భారత జట్టుకు సరైన సమయంలోనే వస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరగనుండటంతో ప్రతి వన్డే సిరీస్ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మాత్రమే వన్డేలు ఆడుతుండటంతో ఈ సిరీస్ మరింత కీలకంగా మారింది. ఇంగ్లాండ్ పరిస్థితులు కూడా భవిష్యత్ మెగా టోర్నీలకు ఉపయోగపడే అనుభవాన్ని అందించనున్నాయి.
ఇటీవల భారత్ అఫ్గానిస్థాన్ను 3-0 తేడాతో ఓడించింది. అయితే ఆ సిరీస్లో కోహ్లీ పాల్గొనలేదు. ఆయన గైర్హాజరీలో యశస్వి జైస్వాల్ చెన్నై వేదికగా అద్భుత శతకం సాధించాడు. మరోవైపు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ కూడా మంచి ప్రదర్శన కనబరిచారు. రోహిత్ శర్మ సైతం నిలకడైన బ్యాటింగ్ చేశాడు. రెండో వన్డేలో అర్ధశతకం, మూడో వన్డేలో శతకాన్ని స్వల్ప తేడాతో కోల్పోయాడు.యువ ఆటగాళ్లు రాణిస్తున్నప్పటికీ, వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ స్థాయికి సరితూగే బ్యాటర్ మరొకరు లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు వన్డేల్లో రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ విరాట్ కోహ్లీనే. కోహ్లీ చివరిసారిగా జనవరిలో న్యూజిలాండ్పై వన్డే సిరీస్ ఆడాడు.