ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. గురువారం బ్రిస్టోల్ వేదికగా జరిగే నాలుగో టీ20లో తలపడబోతోంది.ఇప్పటికే వరుసగా రెండు పరాజయాలతో ఈ సిరీస్లో 2-0తో టీమిండియా వెనుకంజలో నిలిచింది. సిరీస్ గెలిచే అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా.. సిరీస్ కోల్పోకూడదంటే చివరి రెండు మ్యాచ్లు గెలవడం తప్పనిసరి. అటు ఒక్క మ్యాచ్ గెలిచినా సిరీస్ ఇంగ్లాండ్ సొంతమవుతుంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా వరుసగా 5 మ్యాచ్ల్లో ఒక విజయం నమోదు చేయలేదు. దాంతో టీమిండియాకు ఈ నాలుగో టీ20 గెలవడం అనివార్యమైంది.మూడో టీ20లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పాఠం నేర్చుకున్న టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.
సంజూ శాంసన్ స్థానంలో గత రెండు మ్యాచ్లు ఆడిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టవచ్చు. అతని స్థానంలో సంజూ రీఎంట్రీ ఇవ్వవచ్చు. లేదంటే వైభవ్ను కొనసాగించి అభిషేక్ శర్మకు విశ్రాంతినిచ్చి సంజూను ఆడించవచ్చు. సంజూ రాకతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవ్వనుంది.మూడో టీ20 పరాజయం అనంతరం సంజూ శాంసన్ను ఆడించాలంటూ ఫ్యాన్స్ గట్టిగా డిమాండ్ చేశారు. మరోవైపు గంభీర్ కూడా సంజూ ఎప్పుడైనా రీఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫామ్ అందుకోవచ్చని మీడియా సమావేశంలో చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనే కాకుండా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చేయవచ్చు. హార్డ్ లెంగ్త్లు బాగా వేసే ప్రసిధ్ కృష్ణను జట్టులోకి తీసుకురావచ్చు.
ప్రసిధ్ కృష్ణ కోసం అర్ష్దీప్ సింగ్కు రెస్ట్ ఇవ్వొచ్చు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఆల్రౌండర్ సూర్యాన్ష్ షెడ్జేను ఆడించాలనుకుంటే.. ఒక బౌలర్ను పక్కనపెట్టవచ్చు. కాగా నాలుగో టీ20లో విజయం సాధించి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియా టాప్-ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యాన్ని అధిగమించాలి. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోవడం, ప్రత్యర్థి పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం, బౌలింగ్లో పవర్ ప్లే , డెత్ ఓవర్లలో కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ ప్రదర్శించడం అత్యంత కీలకం. గత మ్యాచ్ల్లో ఇన్నింగ్స్ మధ్యలో స్కోరు మందగించడం భారత్కు సమస్యగా మారింది. క్రీజులో ఉన్న బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలు రాబట్టాలి.ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వంటి బౌలర్లు వేగవంతమైన బంతులతో ఇబ్బంది పెడుతున్నారు. కనుక వారిని డిఫెన్సివ్గా కాకుండా, పాజిటివ్ అప్రోచ్తో ఎదుర్కోవాలి.