పుస్తెలు అమ్మైనా పులస తినాలి అంటారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది మాస్టారు. అన్-సీజన్లో అరుదైన అతిథి వచ్చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం గోదావరిలోకి సీజన్ కాని సీజన్లో పులస కొట్టుకొచ్చింది. సాధారణంగా వరదల టైమ్లో వచ్చే ఈ రాజసం ఉట్టిపడే చేప.. ఏప్రిల్లోనే మార్కెట్లోకి రావడంతో జనం ఎగబడ్డారు. అవును మీరు విన్నది నిజమే. సీజన్లో రూ. 25 వేల నుండి రూ.30 వేలు పలికే పులస.. ఇప్పుడు అన్-సీజన్ కావడంతో కేవలం రూ. 4,000 కే దొరికింది.
సాధారణంగా జూలై నుండి సెప్టెంబర్ నెలల మధ్య, అంటే గోదావరికి ఎర్ర నీరు వచ్చే సమయంలో మాత్రమే లభించే పులస చేప, అరుదుగా ఏప్రిల్ మాసంలో పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరి పాయలో జాలర్ల వలకు చిక్కింది. సీజన్ కాని సమయంలో పులస కనిపించడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. పి.గన్నవరం ఫిష్ మార్కెట్కు పులస వచ్చిందన్న వార్త తెలియగానే, స్థానిక పులస ప్రియులు దానిని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. అన్-సీజన్లో దీని రుచి చూడటం అదృష్టంగా భావించి పి.గన్నవరం ఫిష్ మార్కెట్లో ఓ లక్కీ పులస ప్రియుడు ఈ అదిరిపోయే డీల్ కొట్టేశాడు. ఏదేమైనా రూ.4 వేలకే పులస విందు అంటే మామూలు విషయం కాదు కదా.
మరి ఈ సీజన్ లో పులస ఎందుకు వచ్చి ఉండవచ్చు అనే చర్చ మొదలైంది. శాస్త్రీయంగా పులసలు సముద్రం నుండి నదిలోకి గుడ్లు పెట్టడానికి ఎదురీదుతూ వస్తాయి. ఇలా అన్-సీజన్లో రావడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. సముద్ర మట్టాల్లో మార్పులు లేదా నది ప్రవాహంలో వచ్చిన ఆకస్మిక మార్పుల వల్ల ఇవి దారి తప్పి వచ్చి ఉండవచ్చు. జనటిక్ మార్పులు లేదా కాలుష్యం కూడా కారణం కావచ్చు. కాలుష్యం కారణంగా వీటి ఆవాసాలు దెబ్బతినడం వల్ల కూడా వీటి వలస కాలంలో మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.