ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు మరియు ఏపీ ప్రజలకు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, సడన్గా తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ల్యాండ్ అయ్యారు. అక్కడ ఆయనకు అత్యంత కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు.
వైద్య పరీక్షల అనంతరం అంబానీ ఆసుపత్రి వైద్య బృందం పవన్ భుజం గాయంపై కీలక ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, రెండు భుజాలకు సంబంధించిన కండరాలు తీవ్రంగా చిట్లిపోయాయని వైద్యులు నిర్ధారించారు. భుజం ఎముకలను, కండరాలను కలిపి ఉంచే ఈ భాగం దెబ్బతినడం వల్లే ఆయనకు తీవ్రమైన నొప్పి వస్తోందని తేలింది. ఈ గాయం చాలా తీవ్రంగా ఉండటంతో.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే శస్త్రచికిత్స చేయించుకోవాలని, ఆ తర్వాత పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు.
డాక్టర్లు వెంటనే సర్జరీ థియేటర్కు వెళ్లాలని సూచించినప్పటికీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఆరోగ్యం కంటే కూడా ప్రజలకు ఇచ్చిన మాట, ప్రభుత్వ బాధ్యతలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమరావతిలో ముందుగా ఖరారైన అత్యంత కీలకమైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, పాలనాపరమైన పనులు ఉన్నాయని.. వాటన్నింటినీ పూర్తి చేసిన తర్వాతే తాను సర్జరీ చేయించుకుంటానని పవన్ డాక్టర్లకు తేల్చి చెప్పారు. ఆ పనులన్నీ ముగిశాకే శస్త్రచికిత్సకు సంబంధించిన డేట్ ఫిక్స్ కానుంది.
నిజానికి పవన్ కళ్యాణ్ కు ఈ భుజాల నొప్పి నిన్న మొన్న వచ్చింది కాదు. ఏపీ ఎన్నికల సమయంలో ఆయన నిర్వహించిన సుదీర్ఘమైన వారాహి యాత్ర, రోడ్ షోలలో నిరంతరం ప్రజలకు చేతులు ఊపడం, జనాల తాకిడి వల్ల ఆయన రెండు భుజాల కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడింది. ఆ సమయంలోనే ఈ 'రొటేటర్ కఫ్' సమస్య మొదలైనప్పటికీ, ఎన్నికలు ముగిసేవరకు ఆయన నొప్పిని భరిస్తూనే ప్రచారం కొనసాగించారు. దీనికి తోడు ఇటీవలే ఆయన హైదరాబాద్లో సైనస్ సమస్యకు ఒక సర్జరీ చేయించుకున్నారు.
ఆ తర్వాత తీవ్రమైన వెన్నునొప్పి, డిస్క్ పెయిన్ కూడా ఆయనను వేధించాయి. ఒకానొక సందర్భంలో సీఎం చంద్రబాబుతో జరుగుతున్న మీటింగ్లో తీవ్రమైన నడుము నొప్పి రావడంతో మధ్యలోనే వచ్చేయాల్సి వచ్చింది. సాధారణంగా ఎవరికైనా ఒక భుజానికి మాత్రమే ఇటువంటి సమస్య వస్తుంది. కానీ, ముంబై కోకిలాబెన్ ఆసుపత్రి డాక్టర్లు నిర్వహించిన MRI మరియు ఇతర అడ్వాన్స్డ్ స్కానింగ్ పరీక్షల్లో ఆయన రెండు భుజాల రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా చిట్లిపోయినట్లు తేలింది. అందువల్లే ఇరువైపులా సర్జరీ చేయడం అత్యవసరమని వైద్యులు స్పష్టం చేశారు.
ఇలా వరుసగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల మధ్య కూడా ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైద్య నిపుణుల ప్రకారం.. భుజాల రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స జరిగిన తర్వాత కండరాలు తిరిగి సాధారణ స్థితికి రావడానికి కనీసం 6 నుండి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమవుతుంది. అంతేకాకుండా, సర్జరీ తర్వాత కొన్ని నెలల పాటు బరువైన వస్తువులు ఎత్తడం, చేతులు ఎక్కువగా కదపడం వంటి వాటికి దూరంగా ఉండాలి. పూర్తి రికవరీ కోసం ఫిజియోథెరపీ కూడా చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ జనసైనికులు, మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు.