కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తోంది. ఈ సినిమాలో రాధికా శరత్కుమార్, రవీనా టాండన్, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు.
సినిమాకు లభిస్తున్న ఆదరణకు కృతజ్ఞతగా చెన్నైలో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నటి మమితా బైజు వేదికపై ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాను ఇంకా చూడనివారు వెంటనే థియేటర్లకు వెళ్లి చూడాలని, సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి అనుభూతితో, నిండిన మనసుతో వస్తారని అన్నారు.
ఈ చిత్రం ద్వారా తనకు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు దక్కాయని, ప్రేక్షకుల నుండి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. థియేటర్లలో ‘బటర్ ఫ్లై’ పాట వస్తున్నప్పుడు, అలాగే తన కామెడీ సీన్లకు చిన్నపిల్లలు సీట్లలో నుంచి లేచి కేరింతలు కొడుతూ ఆనందించిన వీడియోలు చూసి తాను మురిసిపోయానని చెప్పారు.
ఆ సీన్స్ చూసినప్పుడు తనకు తన చిన్నతనం గుర్తొచ్చిందని, 10-15 ఏళ్ల క్రితం తాను కూడా థియేటర్లలో నచ్చిన నటులను చూసి అలాగే సంబరపడేదాన్నని అన్నారు. ఈరోజు చిన్నపిల్లలు తన నటనను చూసి అలా సంతోషపడటం చూస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నానని చెప్పారు.ప్రస్తుతం మమితా చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.