Pawan Kalyan: బీజేపీ, జనసేనతో పొత్తుపై బీజేపీలో మార్పు.. కలవకపోతే మునుగుతామని బీజేపీ తెలుసుకుందా ?

కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను కీలక మలుపులు తిప్పుతున్నాయ్. నిజమో.. అబద్దమో కానీ.. బీజేపీకి బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయిందనే చర్చ జరుగుతోంది. మిగతా రాష్ట్రాల్లో సంగతి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కమలం పార్టీ స్ట్రాటజీలు మార్చుకుంటోంది. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో జనసేనతో పొత్తు కాని పొత్తులో ఉన్న కమలం పార్టీ.. ఇప్పుడు కొత్త ఆలోచనలో పడింది. అదే హాట్‌టాపిక్ అవుతోంది.

Post Published By: Srikar Creator
Updated : 18 May 2023, 5:45 PM IST

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఏపీ రాజకీయాలపై కూడా పరోక్షంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ బీజేపీతో అంటకాగిన జనసేనతో పాటు పరోక్షంగా మద్దతిస్తున్న వైసీపీ, టీడీపీ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. అయితే అక్కడ బీజేపీ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో.. బీజేపీ లేకుండా కూటమి ఏర్పాటు చేసుకోవాలని ఆయా పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. కమలం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. కమలం పార్టీతో సహా విపక్ష పార్టీలను అన్నింటిని కలుపుకొని.. పోరాటం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్య పార్టీ ఆఫీస్‌లో పవన్ కల్యాణ్‌ చెప్పింది కూడా అదే ! ఇన్నాళ్లూ వైసీపీకి దూరంగా దూకుడుగా పోరాటం చేసేందుకు ముందుకు రాని బీజేపీ నేతలు.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును కూడా కలుపుకోవాలన్న పవన్ సూచనను గతంలో పట్టించుకోలేదు. ఇప్పుడు బీజేపీ అధినాయకులు దీనిపై పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ సై అన్నా.. నై అన్నా.. టీడీపీ, జనసేన కలిసే పోటీకి వెళ్లాలని పవన్ భావిస్తున్నారు. బీజేపీ ఏం చెప్పినా.. ఇక టీడీపీతో జనసేన కలిసే నడవడం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీ అధిష్టానం టీడీపీని కూడా కలుపుకోవాలన్న పవన్ సూచనపై మళ్లీ పునరాలోచిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తుండగా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-సీపీఐ కూటమి కలిపి పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత రామకృష్ణ ప్రకటించారు. మొత్తమ్మీద కర్ణాటక ఫలితం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులకు కారణం అయ్యే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్.

Published : 
  • 18 May 2023, 5:45 PM IST