కిమ్ జోంగ్ ఉన్.. నార్త్ కొరియా డిక్టేటర్. దక్షిణ కొరియా, అమెరికాతో తప్ప మరే దేశంతో అంతగా వివాదాలు లేని లీడర్. ముఖ్యంగా భారత్ జోలికి ఎప్పుడూ రాలేదు. భారత్ కూడా ఎప్పుడూ కిమ్ జోలికి వెళ్లలేదు. పైగా ఉత్తర కొరియా కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ఇండియా అండగా నిలిచింది. ఇప్పుడా సీన్ మారింది. కిమ్ పనికట్టుకుని భారత్ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాడు. అందుకు కారణం.. భారత్ అధ్యక్షతన జరుగుతున్న క్వాడ్ సమ్మిట్. ఇటీవల న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. అప్పుడు రిలీజ్ చేసిన సంయుక్త ప్రకటనలో 'ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా నార్త్ కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ జరగాలని కోరింది. ఆ ప్రకటనపై కిమ్ సీరియస్ అయ్యాడు. భారత్ పేరెత్తకుండానే.. అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎప్పటికీ విడిచిపెట్టబోమని, తమ జోలికి రావొద్దని హెచ్చరించాడు. ఆ తర్వాతే భారత్ లక్ష్యంగా కుట్రలు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కుట్రలకు చెక్ పెట్టడానికే జైశంకర్ సియోల్లో పర్యటించారు.
'సాంగో-క్లాస్' సబ్మెరైన్.. మయన్మార్, నార్త్ కొరియా మధ్య జరిగిన సీక్రెట్ డీల్ ఇదే. మయన్మార్ తన తీరప్రాంత భద్రత కోసం, బంగాళా ఖాతంలో పట్టు సాధించడం కోసం ఇలాంటి చీప్గా దొరికే సబ్మెరైన్ టెక్నాలజీపై కన్నేసింది. నార్త్ కొరియాకు చెందిన నిపుణులు మయన్మార్కు వెళ్లి, అక్కడి నౌకాదళానికి సబ్మెరైన్ల నిర్వహణ, టార్పెడో టెక్నాలజీపై రహస్యంగా శిక్షణ ఇస్తున్నట్లు ఇటీవలే అంతర్జాతీయ నిఘా వర్గాల నివేదికలు తెలిపాయి. మయన్మార్ ఇప్పటికే భారత్ నుండి ఒక పాత కిలో-క్లాస్ సబ్మెరైన్ను, చైనా నుండి మరొక సబ్మెరైన్ను పొందింది. అయితే, చైనా, భారత్పై పూర్తి స్థాయిలో ఆధారపడకుండా, తమ స్వంత సబ్మెరైన్ విభాగాన్ని పెంచుకోవడానికి కొరియాతో రహస్యంగా సాంకేతిక బదిలీ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
మయన్మార్ సరిహద్దులు మన ఈశాన్య రాష్ట్రాలకు ఆనుకుని ఉండటమే కాకుండా, వారి సముద్ర తీరం నేరుగా మన బంగాళాఖాతానికి అనుసంధానమై ఉంటుంది. బంగాళాఖాతంలో ఉత్తర కొరియా సాంకేతికతతో కూడిన మయన్మార్ సబ్మెరైన్లు తిరగడం అంటే.. భారత నేవీకి, అండమాన్ నికోబార్ కమాండ్కు అది ప్రత్యక్ష భద్రతా ముప్పే. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు సూత్రధారి ఎవరో తెలుసా? చైనా. అది నేరుగా మనతో తలపడకుండా, తన మిత్ర దేశాల ద్వారా భారత్ను చుట్టుముట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది. నార్త్ కొరియాను అణ్వాయుధ ల్యాబ్గా వాడుకుంటూ, దాని ద్వారా మయన్మార్ వంటి దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేయించడం బీజింగ్ వ్యూహం. దీనివల్ల చైనాపై నేరుగా ఎలాంటి అంతర్జాతీయ ఆంక్షలు రావు. చైనా ఈ కుట్రల గురించి భారత్కు కూడా తెలుసు. అందుకే ఆ మూడు దేశాలు లక్ష్యంగా స్వయంగా జైశంకరే యాక్షన్లోకి దిగారు. సియోల్లో సరికొత్త గేమ్ స్టార్ట్ చేశారు.
'జెజు ఫోరమ్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ 2026 సదస్సు కోసం జైశంకర్ సియోల్ వెళ్లారు. జైశంకర్ తన ప్రసంగంలో షిప్-బిల్డింగ్ అంటూ నౌకల నిర్మాణం, డిజిటల్, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాలు అనే నాలుగు పిల్లర్లని హైలైట్ చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సబ్మెరైన్లు, యాంటీ-సబ్మెరైన్ వార్ఫేర్ అంటే నౌకలను, జలాంతర్గాములను కూల్చే సాంకేతికత కలిగిన దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. జైశంకర్ సౌత్ కొరియా షిప్-బిల్డింగ్ రంగాన్ని ఆహ్వానించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. మన నేవీ, కోస్ట్ గార్డ్ నౌకల నిర్మాణ వేగాన్ని పెంచడమే. మయన్మార్-ఉత్తర కొరియా సబ్మెరైన్లకు చెక్ పెట్టాలంటే, బంగాళాఖాతంలో భారత నేవీ నిఘా, దాడి సామర్థ్యం అత్యంత ఆధునికంగా ఉండాలి. అందుకు సౌత్ కొరియా టెక్నాలజీ భారత్కు ఎంతగానో ఉపయోగ పడుతుంది.
దక్షిణ కొరియా విదేశాంగ మంత్రితో జైశంకర్ జరిపిన చర్చల్లో 'రక్షణ, డిజిటల్' అంశాలు ప్రధానంగా వచ్చాయి. దీని అంతరార్థం.. శాటిలైట్ నిఘా, రియల్-టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగే. ఉత్తర కొరియా నుండి బయలుదేరే అనుమానాస్పద నౌకలు, మయన్మార్ తీరంలో తిరిగే చైనా సబ్మెరైన్ల కదలికలను సౌత్ కొరియా నిఘా వ్యవస్థల ద్వారా భారత్ సేకరించగలదు. అలాగే హిందూ మహాసముద్రంలో చైనా కదలికల సమాచారాన్ని భారత్ దక్షిణ కొరియాకు ఇవ్వగలదు. ఈ సమాచార మార్పిడి శత్రు కూటమి వ్యూహాలను ముందుగానే పసిగట్టడానికి సహాయపడుతుంది. జైశంకర్ దౌత్యం ఎప్పుడూ 'డిఫెన్సివ్గా ఉండదు, అది అఫెన్సివ్ వ్యూహాలతోనే ఉంటుంది. అందుకే, మయన్మార్ సరిహద్దుల్లో ఉత్తర కొరియా సబ్మెరైన్ డీల్ రూపంలోనో, చైనా కుట్రల రూపంలోనో ముప్పు పొంచి ఉందని తెలిసిన వెంటనే.. ఆ రెండు దేశాల శత్రువుకు శత్రువైన దక్షిణ కొరియాతో భారత్ చేతులు కలిపింది.