Pawan Kalyan is in danger in Bhimavaram?
భీమవరం (Bhimavaram)... ఏపీ పాలిటిక్స్ (AP Politics) లో ఇప్పుడు హాట్ సీట్గా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ పోటీ కోసం పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన రెండు పార్టీల నేతలు... సై అంటే సై అంటున్నారు. కానీ... లోకల్ లీడర్స్ ఎవరెంత కిందా మీదాపడ్డా... ఫైనల్గా అందరి చూపు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపే ఉంది. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీచేసి ఓడిన పవన్... తిరిగి ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)... 2019లో చివరి నిమిషంలో భీమవరాన్ని ఎంచుకోవడంతో... క్యాడర్ని సమన్వయం చేసుకోడానికి, జనాన్ని మెప్పించడానికి టైమ్ సరిపోకే ఓడారన్నది జనసేన పార్టీ నేతల మాట. మరి ఇప్పుడో... ఐదేళ్ళకు మరో ఎన్నిక వస్తోంది. కానీ.. ఇప్పటివరకు పవన్ భీమవరం బరిలో ఉంటారా లేదా అన్నది మాత్రం తేలలేదు. ఆ ఎపిసోడ్ జీడిపాకంలా సాగుతూనే ఉంది. దీంతో అటు టీడీపీ (TDP) , ఇటు జనసేన (Janasena) స్థానిక నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. సమయం లేదు మిత్రమా... రణానికి సిద్దమంటూ జనసైనికులు పిలుపునిస్తున్నా... అధినేత నుంచి మాత్రం క్లారిటీ రాక అయోమయంలో ఉన్నారట. గత ఎన్నికల్లో సమయం, సరైన బలం లేకపోవడంతో భీమవరం (Bhimavaram) లో ఓడామని చెబుతున్న నేతలు... ఇప్పుడు కావాల్సినంత సమయం, గతానికి మించిన సైన్యం ఉన్నా... సమర శంఖం పూరించేది మాత్రం ఎవరన్న స్పష్టత లేక తికమక పడుతున్నారట కార్యకర్తలు.
గత ఎన్నికల్లో భీమవరంలో ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు పవన్. ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది. అయితే ఇపుడు జనసేన లెక్క వేరుగా ఉంది. గతానికి భిన్నంగా ఈసారి టీడీపీతో కలసి వెళ్తున్నాం కాబట్టి... మా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరనేది వారి ధీమా. వినడానికి పైకి బాగానే ఉన్నా... ఆలస్యం జరిగితే మాత్రం లెక్కలు తప్పేలా ఉన్నాయన్నది స్థానిక నాయకుల భయం. కారణం... భీమవరం టీడీపీ అంతా ఇపుడు గందరగోళంగా ఉంది. నియోజకవర్గ ఇంఛార్జ్, జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మి వైఖరితో భీమవరం కేడర్ ముక్కలు చెక్కలైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పైగా ఇక్కడ పోటీకి తెలుగుదేశం ఆశావహులు కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు... పవన్ పోటీ చేయకుంటే తానే అభ్యర్ధిననే నమ్మకంతో ఉన్నారు. పవన్ కాకుంటే మేము సిద్దమేనంటూ బీజేపీ కూడా తెరపైకొచ్చే అవకాశాలు లేకపోలేదు.
ఇంత గందరగోళం, మరింత అయోమయంలో ఉన్న భీమవరం విషయంలో వ్యవహారాన్ని ఇంకా నాన్చి పవన్ తెగేదాకా లాగుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. ఇప్పుడు క్లారిటీ వస్తేనే... చిందర వందర గందరగోళ వాతావరణాన్ని సెట్ చేయడానికి టైం సరిపోతుందని, అలా కాదని నాన్చితే... ఏదైనా జరగొచ్చన్న భయాలు వెంటాడుతున్నాయట రెండు పార్టీల స్థానిక నేతల్ని. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా... వైసీపీ (YCP) నుంచి ఉన్న ప్రత్యర్ధిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్న అభిప్రాయం సైతం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్... స్థానిక నాయకులు కాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే నా పని తేలిక అవుతుందంటూ లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్తో కాలు దువ్వుతున్నారట. నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంధి.. హ్యాట్రిక్పై ధీమాగా ఉన్నారట ఆయన.
ఈ పరిస్థితుల్లో భీమవరం ఓటర్లను మెప్పించడానికి మ్యాగ్జిమమ్ సమయాన్ని కేటాయించాల్సింది పోయి... మినిమమ్ ఫోకస్ కూడా పెట్టకుంటే ఎలాగన్న ప్రశ్నలు జనసేన వర్గాల నుంచే వస్తున్నాయి. ఒకవేళ ఆయన రాకుంటే... కనీసం మాకైనా అవకాశం ఇవ్వండంటూ జనసేనలో కొందరు, టిడిపి నుంచి మరికొందరు ఎదురు చూస్తున్నారు. పోయినచోటే వెతుక్కొవాలనే పట్టుదలతో ఉన్న పవన్ భీమవరం విషయంలో క్లారిటీ ఇచ్చేదెపుడు అని రెండు పార్టీల నాయకులు ఉత్కంఠగా చూస్తున్నారు. మరి భీమవరం విషయంలో పవన్ త్వరగా తేల్చుతారా లేక ఇంకా నాన్చుతారా అన్నది చూడాలి.