కాలం కలిసిరాకపోతే...తాడే పామై కరుస్తుందా ? రాజకీయాల్లో ఒక్కసారి ఒటమి పలుకరిస్తే...పొగిడిన నోళ్లే తెగుడుతాయా ? అధికారం ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి...అది పోయాక విమర్శలు చేయడం..రాజకీయాల్లో కామన్ అయింది. ప్రస్తుతం పాలిటికల్ నేతలు..ఏ ఎండకు ఆ గొడుకు పడుతున్నారా ? పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఇవే సీన్లు కనిపిస్తున్నాయా ? మొన్నటి వరకు దీదీని ఆకాశానికి ఎత్తేసిన నేతలు...ఇప్పుడు తిట్ల దండకం ఎందుకు అందుకుంటున్నారు ? అభిషేక్ బెనర్జీని సాకుగా ఎందుకు చూపిస్తున్నారు ? ఇప్పడిదే రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.
నిన్నటి వరకు ఆమె కాళికామాత...నేడు ఆ దేవత కాస్త దయ్యం అయిపోయింది. ఇది పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్లో మారిన ముఖచిత్రం.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నంత కాలం...ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీకామాత అంటూ కీర్తించారు.
కేంద్రంలోని బీజేపీకి అసలైన పోటీదారు అంటూ...టీఎంసీ నేతలు జబ్బలు చరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే...మమత బెనర్జీపై సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అనరాని మాటలు అంటున్నారు. సీనియర్లను కాదని అల్లుడు అభిషేక్ బెనర్జీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు...టికెట్ల కోసం మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్లీజ్ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. టికెట్లు తెచ్చుకున్నారు, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలుకాగానే...గొంతు మారిపోయింది. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా పూర్తిగా సైలెంట్ అయాపోయారు. ఎంపీలు, ఎమ్మెల్యేల చీలికలతో...తృణమూల్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది.
20 మందికిపైగా ఎంపీలు...టీఎంసీపై తిరుగుబాటు చేశారు. సొంత కుంపటి పెట్టుకున్నారు. ఎన్సీపీఐ అనే అడ్రస్ లేని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అటు 70 మంది ఎమ్మెల్యేలు కూడా...తృణమూల్కు దూరంగా జరిగారు. అక్కడితో ఆగని శాసనసభ్యులు...మమతా బెనర్జీ పార్టీ ఛైర్పర్సన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకించారు. తాత్కాళిక ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీని ఎన్నుకున్నారు. మమతా పార్టీలో ఉండాలని అనుకుంటే...ప్రధాన సలహాదారుగా ఉండవచ్చు అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఇక ఎంపీ సయోని ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మమతా బెనర్జీకి నమ్మినబంటు. తొలి ఎన్నికల్లో ఓటమి పాలయినా...రెండోసారి టికెట్ ఇచ్చారు. సయోని ఘోష్ను ఎంపీగా గెలిపించుకున్నారు. టీఎంసీ అధికారం కోల్పోయాక...మమతా బెనర్జీ వెంటే నడుస్తానని బీరాలు పలికారు. పార్టీని వీడేది లేదని...తాను రాఘవ్ చద్దా కాదంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. సీన్ కట్ చేస్తే...తృణమూల్కు బై బై చెప్పేశారు. ఎన్సీపీఐలో చేరిపోయారు. మొన్నటి వరకు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకున్న సయోని...ఇప్పుడు టీఎంసీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
టీఎంసీ ఫైర్బ్రాండ్ మహువా మెయిత్రా...పార్టీలో తనకు ఎదురైన అవమానాలను ఇటీవల బయటపెట్టారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి సువేందు అధికారిపై ప్రశంసలు కురిపించారు. 20174లో లోక్సభ టికెట్ రాకపోవడంతో రాత్రంతా ఏడ్చానని మహువా వెల్లడించారు. కరీంపూర్ నుంచి పోటీ చేసినపుడు నేతలు ఎవరు రాలేదని...ఒక్క సువేందు అధికారి మాత్రమే వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయన కాషాయ పార్టీలో చేరిన తర్వాతే మాట్లాడుకోలేదని...క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచారని...చేసిన సాయాన్ని ఎప్పటికి మరచిపోనని చెప్పారు. వ్యక్తిగత సంబంధాలు పార్టీలకు అతీతమైనవని...సీఎం సువేందు అధికారిని ఎప్పుడు గౌరవిస్తానని వెల్లడించారు. మహువా వ్యాఖ్యలతో బెంగాల్ రాజకీయాల్లో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు మాతో ఉంటారో...లేదంటే అభిషేక్ బెనర్జీ వెంట నడుస్తారో తేల్చుకోవాలంటూ ఎంపీ కల్యాణ్ బెనర్జీ...దీదీకి అల్టిమేటం జారీ చేశారు. సీనియర్లను గౌరవించకపోవడం వల్లే పార్టీ నాశనం అవుతోందని మమతకు హెచ్చరికలు చేశారు. టీఎంసీ అధికారంలో ఉన్నంతకాలం...దీదీకి ఎదురు వెళ్లాలంటే వణికిపోయారు. ఇప్పుడేమో విమర్శలు, ఆరోపణలతో రెచ్చిపోతున్నారు.