ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సోషల్ మీడియా వేదికలపై గత రెండు రోజులుగా ఇద్దరు మహిళా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పేర్లు మారుమోగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫలితాలు మరియు స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విమర్శల దాడి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడూ లేని విధంగా నిన్న ఇద్దరు ఐఏఎస్ స్థాయి మహిళా అధికారులు నేరుగా మీడియా ముందుకు వచ్చి పక్కా ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు.
వారు మాట్లాడిన తీరు, చూపించిన లెక్కలు చూసి విమర్శలు చేసిన వైసీపీ సోషల్ మీడియా వింగ్కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు మీడియా ముందుకు వచ్చి అంత ధైర్యంగా క్లారిటీ ఇచ్చిన ఆ ఇద్దరు అధికారులు ఎవరు? వారు వైసీపీ సోషల్ మీడియాకు నిద్ర లేకుండా చేసే అంత దమ్ము ఎక్కడి నుండి తెచ్చుకున్నారు?
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయంటూ, అర్హులైన వారికి కాకుండా వేరే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం సాగింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్ష శ్రేణులు దీనిని ఆయుధంగా మార్చుకున్నాయి. కానీ, నిన్న స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా ఐఏఎస్, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి ఐఎఫ్ఎస్ నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నోటిఫికేషన్ నిబంధనలు ఏమిటి, అభ్యర్థులు చేసిన పొరపాట్లు ఏంటి అనేవి పాయింట్ టు పాయింట్ వివరించారు. ఉన్నతాధికారులే నేరుగా మీడియా ముందుకు వచ్చి రూల్ బుక్ చూపించేసరికి, ఫేక్ వార్తలతో హల్చల్ చేసిన ట్రోలర్స్ అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
మొదటగా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ మరియు ఐఏఎస్ అధికారి అయిన తమీమ్ అన్సారియా గురించి మాట్లాడుకుంటే.. ఆమె 2015 బ్యాచ్కు చెందిన అత్యంత సమర్థురాలైన డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ అధికారిణి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమీమ్ అన్సారియా, ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో చేరిన తర్వాత ఆమె శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్గా, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్గా, ప్రకాశం జిల్లా కలెక్టర్గా మరియు గుంటూరు జిల్లా కలెక్టర్గా సుదీర్ఘమైన గ్రౌండ్ లెవెల్ అనుభవాన్ని సంపాదించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో బాండెడ్ లేబర్ పై ఆమె చేసిన పోరాటం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెకు.. చట్టాలు, జీవోలపై పూర్తి పట్టు ఉంది. అందుకే మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి తడబాటు లేకుండా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టగలిగారు.
ఇక మరో అధికారిణి ఎస్. భరణి. ఈమె ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు చెందిన 2021 బ్యాచ్ అధికారిణి. చిత్తూరు డీఎఫ్ఓగా సమర్థవంతంగా పనిచేసిన ఈమెను, ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై వస్తున్న ఆరోపణలపై భరణి అత్యంత స్పష్టమైన వివరణ ఇచ్చారు. "ఉద్యోగాలు రాలేదని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కానీ వారు నోటిఫికేషన్ సమయంలో ఆన్లైన్లో తమ ఒరిజినల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయలేదు.
కేవలం అప్లికేషన్ పెట్టేసి, ఆ తర్వాత మాకు మెడల్స్ ఉన్నాయంటే కుదరదు" అని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, కోర్టు ఆదేశిస్తే ఉద్యోగాలకు ఎంపికైన వారికి స్కిల్ టెస్ట్ పెట్టడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. చట్టబద్ధంగా తాము క్లీన్గా ఉన్నామని చెప్పడానికి ఆమె చూపించిన ధైర్యం చూసి ఐఏఎస్ సర్కిల్స్ కూడా ఫిదా అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అధికారులు మీడియా ముందుకు రావడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఈ నిన్నటి ప్రెస్ మీట్లో ఆ ఇద్దరు అధికారులు చూపించిన కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే.. పూర్తి పారదర్శకత.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రాసెస్ అంతా ఆన్లైన్ ద్వారా డిజిటల్ పద్ధతిలో, జీవో ప్రకారం నిబంధనలకు లోబడే జరిగిందని వారు గట్టిగా నమ్మారు. ఎప్పుడైతే మన వైపు తప్పు లేదో, అప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదనే దమ్ము ఈ ఇద్దరు లేడీ ఆఫీసర్ల మాటల్లో స్పష్టంగా కనిపించింది. రాజకీయ విమర్శలకు అధికారులను లాగాలని చూసిన వారికి, తమ పక్కా అడ్మినిస్ట్రేటివ్ ఆన్సర్స్తో నోళ్లు మూయించారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత వైసీపీ సోషల్ మీడియా వింగ్కు ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో తెలియక డిఫెన్స్లో పడిపోయింది.
సమాజంలో మార్పు రావాలన్నా, వ్యవస్థ పారదర్శకంగా నడవాలన్నా ఇలాంటి నిబద్ధత కలిగిన అధికారుల అవసరం ఎంతైనా ఉంది. అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన వెంటనే, దాక్కోకుండా నేరుగా మీడియా ముందుకు వచ్చి ప్రజలకు క్లారిటీ ఇవ్వడం ఒక సరికొత్త ట్రెండ్కు తెరలేపింది.