డియెగో గార్సియా స్థావరాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇది. దీన్ని ప్రకటన కంటే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కు వార్నింగ్ఇచ్చారు అనడమే కరెక్ట్. ఇటీవల చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అంగీకరించాడు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ అతిపెద్ద తప్పిందంగా అభివర్ణించాడు. అణు ఒప్పందం విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, డియెగో గార్సియా బేస్ను మారిషస్కు అప్పగించ వద్దని బ్రిటన్ ప్రధానిని ట్రంప్ హెచ్చరించాడు. హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న డియెగో గార్సియాపై బ్రిటన్ పట్టుకోల్పోవడం తీవ్ర నష్టం కలిగిస్తుందని గగ్గోలు పెట్టాడు. ట్రంప్ ఎందుకింతగా గగ్గోలు పెడుతున్నాడో తెలసుకోవాలంటే డియెగో గార్సియా ఎంత కీలక ప్రాంతంలో. మారిషస్, బ్రిటన్ చాగోస్ దీవుల వివాదం ఏంటో తెలుకోవాలి.
మాల్దీవులకు దక్షిణాన, భారత తూర్పు తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రంలో ఉన్న 60కి పైగా చిన్నదీవుల సమాహారమే చాగోస్. ఈ దీవుల్లో అతిపెద్దది డియెగో గార్సియా. ఇక్కడే UK, అమెరికా సంయుక్త మిలిటరీ స్థావరం ఉంది. 1814లో నెపోలియన్ యుద్ధాల తర్వాత బ్రిటన్ ఈ దీవులను ఫ్రాన్స్ నుంచి స్వాధీనం చేసుకుంది. 1969లో బ్రిటన్ వలస పాలన నుంచి మారిషస్ స్వాతంత్య్రం పొందడానికి ముందు వరకూ.. ఈ దీవులు మారిషస్లో భాగంగానే ఉండేవి. అయితే, బ్రిటన్ మారిషస్ను చట్టవిరుద్ధంగా విభజించిందని అంతర్జాతీయ న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.
అమెరికా సైనిక స్థావరం ఉన్న డియెగో గార్సియా సహా చాగోస్ దీవులను మారిషస్కు తిరిగి అప్పగించాల్సిందేనని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బ్రిటన్ను డిమాండ్ చేస్తూ తీర్మానించింది. కానీ, దీనిని బ్రిటన్ అంగీకరించలేదు. చివరికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి చెక్ పెడుతూ గతేడాది.. బ్రిటన్ చాగోస్ దీవుల పరిపాలనా హక్కులను మారిషస్కు అధికారికంగా బదిలీ చేసే ఒప్పందానికి అంగీకరించింది. అయితే, డియెగో గార్సియాలోని US-బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరాన్ని మాత్రం 99 ఏళ్ల లీజుకు బ్రిటన్ తన వద్దే ఉంచుకుంటుంది. బ్రిటన్ చాగోస్ దీవులను అప్పగించి, సైనిక స్థావరాన్ని లీజుకు తీసుకోవడంపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ అభ్యంతరానికి అసలు రీజన్ ఏంటో చూద్దాం..
2025 ఏప్రిల్లో ఇరాన్తో ఉద్రిక్తతలు పీక్స్కు చేరినప్పుడు సుమారు 6 బీ-2 బాంబర్లను డియెగో గార్సియా బేస్కు తరలించారు. ఇది ఇరాన్ను హెచ్చరించడానికి, ఒకవేళ దాడి చేయాల్సి వస్తే సిద్ధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు. జూన్లో మిలిటరీ ఆపరేషన్ సమయంలో ఇరాన్ను తప్పుదోవ పట్టించడానికి కొన్ని బాంబర్లు డియెగో గార్సియా, గువామ్వైపు వెళ్తున్నట్లు నటించాయి. కానీ అసలు దాడి చేసిన 7 బాంబర్లు అమెరికాలోని మిస్సోరి నుండి నేరుగా 18 గంటల పాటు ప్రయాణించి, గాలిలోనే ఇంధనం నింపుకుంటూ వచ్చి ఇరాన్పై బాంబులు వేశాయి. అలా ఆ సమయంలో డియాగో గార్సియా స్థావరాన్ని వ్యూమాత్మకంగా ఉపయోగించుకుంది అమెరికా.
ఇరాన్ ఫోకస్ అంతా డియెగో గార్సియా బేస్పై ఉన్నప్పుడు సైలెంట్గా బంకర్ బస్టర్లతో విరుచుకుపడింది. ఇప్పుడు ఇరాన్తో పూర్తి స్థాయి యుద్ధం వస్తే ఆ వైమానిక స్థావరం కీలకం అవుతుంది. ఎందుకంటే, ఈ యుద్ధం కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇంధనం నింపుకుంటూ గంటల తరబడి ప్రయాణం చేసి దాడులు చేయడం అసాధ్యం. సో.. ఇరాన్తో యుద్ధానికి దిగితే డియెగో గార్సియా స్థావరం కీలకం అవుతుంది. రీసెంట్గా ఇరాన్ను భయపట్టేందుకు 50 యుద్ధ విమానాల్ని పశ్చిమాసియా స్థావరాలకు పంపించారు. వాటిలో అత్యధికం పసిఫక్ మహాసముద్రంలోని డియెగో గార్సియా బేస్లోనే దిగాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే స్టార్మర్ షాకిచ్చాడు.
ఇరాన్పై దాడి చేసే ప్లాన్లో భాగంగా బ్రిటన్కు చెందిన డియెగో గార్షియా బేస్ను ఉపయోగించుకునేందుకు అమెరికా ప్రత్యేక అనుమతి కోరింది. ఇరాన్పై దాడి సమయంలో అవసరమైతే ఉమ్మడి ఎయిర్బేస్ వాడుకునేందుకు ట్రంప్ సర్కార్.. బ్రిటన్ పర్మిషన్ అడిగింది. కానీ, ట్రంప్ అభ్యర్థనకు ఝలక్ ఇస్తూ.. యూకేలోని కీర్ స్టార్మర్ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అటువంటి దాడిలో పాల్గొని అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించబోమని తేల్చి చెప్పింది. ఈ దాడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదని పేర్కొంది.
ఇరాన్పై దాడికి అన్ని విధాలుగా సిద్ధమైన ఈ సమయంలో బ్రిటన్ హ్యాండ్ ఇచ్చేసరికి ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. చాగోస్ దీవులను మారిషస్కు ఇవ్వడం వ్యూహాత్మక తప్పిదం అంటూ ఇప్పటివరకూ ఉమ్మడిగా ఉన్న డియెగో గార్సియా స్థావరాన్ని పూర్తిగా సొంతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నాడు. వివరంగా చెప్పాలంటే, డానిష్ దేశం నుంచి గ్రీన్ లాండ్ను సొంతం చేసుకోడానికి ఎలా అయితే కుట్రలు చేస్తున్నాడో.. బ్రిటన్ నుంచి డియెగో గార్సియాను సొంతం చేసుకోడానికి అన్నే కుట్రలు చేస్తున్నాడు. ఈ మొత్తం వివాదం ఇప్పుడు ఇరాన్ వర్సెస్ అమెరికాగా కాదు, అమెరికా వర్సెస్ బ్రిటన్గా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.