వైసీపీలో ప్రకంపనలు.. మిథున్ రెడ్డి గుడ్ బై..

వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? ఢిల్లీలో పట్టు కోసం ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన మార్కు రాజకీయం మొదలుపెట్టబోతున్నారా..?

Post Published By: Vencateshg
Updated : 11 February 2025, 2:05 PM IST

వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? ఢిల్లీలో పట్టు కోసం ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన మార్కు రాజకీయం మొదలుపెట్టబోతున్నారా..? తాను చెప్పిన 2.0 వెర్షన్ కు జగన్ ఇప్పటికే కథ సిద్ధం చేసి పెట్టుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. వైసిపి నుంచి అలాగే రాజకీయాల నుంచి తప్పుకున్న ఆ పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. స్థానాన్ని ఢిల్లీలో భర్తీ చేయడానికి జగన్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని, ఎంపీలు ఢిల్లీలో పట్టు పెంచుకోవడానికి.. ఏ విధంగా అవకాశం ఉంటే ఆ మార్గంలో వెళ్లడానికి జగన్ సిద్ధమవుతున్నారు.

అందుకోసం తన పార్టీ ఎంపీలను కూడా ఆయన త్యాగం చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీలో కీలక నేతలుగా ఉన్న... రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిలను బిజెపిలోకి పంపించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు జగన్ రాజకీయం మనుగడ సాగించాలి అంటే ఢిల్లీలో పట్టు అత్యంత కీలకం. అటు కాంగ్రెస్ లేదంటే ఇటు బిజెపితో జగన్ స్నేహం చేయాల్సి ఉంది. ప్రస్తుతం బిజెపికి జగన్ దగ్గర కావాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ.. బిజెపికి చాలా దగ్గరగా ఉన్నాయి.

దీనితో జగన్ కు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ సమయంలో జగన్ రాజకీయంగా కీలక అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. బిజెపికి అవసరమైన ఎంపీలను తాను ఇవ్వటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన పార్టీలో ప్రస్తుతం నలుగురు లోక్సభ ఎంపీలన్నారు. అందులో ఇద్దరిని బీజేపీలోకి పంపించాలని జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో తనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేవారు విజయసాయి రెడ్డి.

అయితే ఇప్పుడు మాత్రం ఆయన రాజీనామా చేయడంతో.. జగన్ కచ్చితంగా ఒంటరి అయిపోయారు. ఢిల్లీలో జగన్ మాట.. చెల్లె పరిస్థితి కనపడటం లేదు. ఒకవేళ కొంతమంది స్నేహితులు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి తోనే సన్నిహితంగా ఉన్నారు. దీనితో జగన్ ఇప్పుడు రాజకీయంగా కీలక అడుగులు వేసినందుకు ఓ ప్రణాళిక ప్రకారం వెళుతున్నారు. అందుకే మిథున్ రెడ్డిని.. అవినాష్ రెడ్డినీ తనకు ఇబ్బంది లేకుండా.. బిజెపిలోకి పంపించేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు.

అటు వైయస్ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆయనను బిజెపిలోకి పంపిస్తే ఇబ్బందులు ఉండవని కూడా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కుటుంబంలో జరిగిన ఒక సమావేశంలో వైఎస్ సునీతతో.. జగన్, అవినాష్ రెడ్డి బిజెపిలోకి వెళ్లే అంశంపై ఒక కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బయటపడటానికి అవసరమైతే బీజేపీలోకి వెళ్తాడని, ఏమవుతుందని.. జగన్ ప్రశ్నించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ ఈ అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. తన తమ్ముడు కాబట్టి తనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక మిథున్ రెడ్డిని కూడా జగన్ బాగా నమ్ముతూ ఉంటారు. ఏం జరుగుతుందో చూడాలి.

Published : 
  • 11 February 2025, 2:05 PM IST