ఈ నెలాఖరుతో ఐపీఎల్ 2026 సీజన్ ముగియనుంది. జూన్ నుంచి టీమ్ఇండియా క్రికెటర్ల అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్ ప్రారంభం కానుంది. జూన్ 6 నుంచి 10 వరకు అఫ్గానిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ ద్వారా భారత అంతర్జాతీయ షెడ్యూల్ ఆరంభం కానుంది.ఈ నేపథ్యంలో ఐపీఎల్ ముగిసేలోపు అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్కు జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో పాటు ఆ తరువాత సిరీస్లకు సంబంధించిన ప్రణాళికల కోసం సెలక్టర్లలో బీసీసీఐ సమావేశం నిర్వహించనుంది.
ఇందులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాబోయే కొద్ది నెలల కార్యాచరణ ప్రణాళికపై చర్చించడానికి బీసీసీఐతో సమావేశం ఏర్పాటు చేయనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఏడు నుంచి 10 రోజుల్లో ఈ సెలక్షన్ సమావేశం జరగనుందని చెప్పింది. పేసర్ల బృందాన్ని ఖరారు చేయడమే బోర్డు అజెండాలో అగ్రస్థానంలో ఉందని ఆ నివేదిక పేర్కొంది.
అఫ్గానిస్థాన్తో జరిగే ఏకైక టెస్టు కోసం జట్టు నాణ్యత విషయంలో రాజీ పడటానికి బోర్డు ఇష్టపడటం లేదని సమాచారం. అందుకే.. జట్టు ప్రధాన పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడని మహమ్మద్ షమీని మరోసారి పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారత్ చివరిసారిగా అఫ్గానిస్థాన్తో టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు ప్రధాన జట్టునే ఆడించింది. దీంతో పలువురు సీనియర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం లేదని అర్థమవుతోంది.ఇదిలా ఉంటే.. రాబోయే తొమ్మిది నెలల్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా భారత్ తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది, అయితే.. అఫ్గానిస్థాన్తో జరగనున్న ఏకైక టెస్టు ఈ సైకిల్లో భాగం కాదు.