టీమిండియా సీనియర్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2025-26 దేశీవాళీ సీజన్లో బెంగాల్ తరఫున ఆడి మహ్మద్ షమీ ఏకంగా 67 వికెట్లు పడగొట్టినప్పటికీ.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ షమీని టీమిండియాలోకి రీకాల్ చేయలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత షమీని సెలక్టర్లు పక్కన పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు షమీ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి అడిగిన ప్రశ్నకు చాలా నిర్మొహమాటంగా స్పందించాడు. కేవలం వయసును బట్టి కాకుండా తన ఉత్సాహం తగ్గినప్పుడే ఆటకు స్వస్తి పలుకుతానని సెలెక్టర్లకు పరోక్షంగా సంకేతాలిచ్చాడు. ప్రస్తుతానికి తనకు టైర్మెంట్ ఆలోచనలు లేవన్నాడు. ఒకవేళ ఆ ఆలోచన మనసులోకి వచ్చిందంటే.. మనం ఇప్పటికే అలసిపోయామని అర్థం అంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడు నిద్రలేచిన తర్వాత క్రికెట్ పట్ల బోర్గా ఫీలవుతానో ఆ రోజే వీడ్కోలు ప్రకటిస్తానని షమీ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ఫిట్గా ఉన్నానని.. ఆటను ఎంజాయ్ చేస్తున్నానని.. ఫలితాలు కూడా సానుకూలంగానే ఉన్నాయని షమీ ధీమా వ్యక్తం చేశాడు.
2023 వన్డే ప్రపంచ కప్లో భారత్ను ఫైనల్ చేర్చడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. అయితే గాయాల కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైనా తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించి దేశవాళీ క్రికెట్లో సత్తా చాటాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్లకు, టీ20 వరల్డ్ కప్కు అతడిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. కేవలం వయసును ప్రామాణికంగా తీసుకుని సెలెక్టర్లు యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ ప్రయాణంలోనూ ఈ సీనియర్ పేసర్ కొన్ని ఆసక్తికర మార్పులు ఎదుర్కొన్నాడు. 2025 మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ షమీని కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్ లో రాణించకపోవడంతో షమీని విడుదల చేసింది.ప్రస్తుతం షమీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ట్రేడ్ అయ్యాడు. కొత్త జట్టు తరపున రాణిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో ఎన్ని వికెట్లు తీసినా..బౌలింగ్ రిథమ్ బాగుందా లేదా అనే దానిపైనే దృష్టి పెడతానని షమీ వ్యాఖ్యానించాడు. సెలెక్టర్లు పక్కన పెట్టినా, తనలో ఇంకా కసి తగ్గలేదని, వికెట్ల వేట కొనసాగిస్తానని షమీ చెప్పకనే చెప్పాడు.