టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిడుగులాంటి వార్త చెప్పారు. ఈ మెగా టోర్నీలో టీమిండియాపై తమ జట్టు మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని ఆయన కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు.భారత్తో మ్యాచ్ను బహిష్కరించడానికి గల కారణాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ వివరిస్తూ.. ఇది బంగ్లాదేశ్కు సంఘీభావంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ను ఐసీసీ టోర్నీ నుంచి తొలగించడాన్ని పాక్ తప్పుబట్టింది. టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడకూడదని తాము చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదనీ, బంగ్లాదేశ్ పట్ల జరిగిన అన్యాయానికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు.. ఇది చాలా సరైన నిర్ణయమని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.
మరోవైపు పాకిస్థాన్ జట్టు ఇప్పటికే శ్రీలంక చేరుకున్నప్పటికీ.. భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తామని చెప్పడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మండిపడింది. ఒక ప్రపంచ స్థాయి టోర్నీలో అన్ని జట్లు సమాన నిబంధనలతో ఆడాలని, ఇలా నచ్చిన మ్యాచ్లు ఆడతామంటే కుదరదని ఐసీసీ తేల్చి చెప్పింది. ఒకవేళ మ్యాచ్ను బహిష్కరిస్తే ఆ పాయింట్లను ప్రత్యర్థి జట్టుకు కేటాయించడమే కాకుండా.. పీసీబీపై 35 మిలియన్ డాలర్ల జరిమానా, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం క్వాలిఫై అయిన ప్రతి దేశం షెడ్యూల్ ప్రకారం ఆడాల్సి ఉంటుంది. పాకిస్థాన్ తన పంతం నెగ్గించుకుంటుందా లేక ఐసీసీ ఆంక్షలకు భయపడి వెనక్కి తగ్గుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే కోట్లాది మంది అభిమానులు నిరాశ చెందడమే కాకుండా, బ్రాడ్ కాస్టర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇదే అంశంపై పీసీబీతో ఐసీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. అటు బ్రాడ్ కాస్టర్లు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.