Women’s Asia Cup : ఫైనల్లో భారత్ కు షాక్.. శ్రీలంకదే మహిళల ఆసియాకప్

మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్ కు షాక్ తగిలింది. ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 July 2024, 7:00 PM IST

మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్ కు షాక్ తగిలింది. ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది. ఆతిథ్య శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. షెఫాలీ త్వరగానే ఔటైనా మంధాన దూకుడుగా ఆడింది. ఉమా చెత్రి, హర్మన్ ప్రీత్ కౌర్ నిరాశపరిచారు. మంధాన 47 బంతుల్లో 10 ఫోర్లతో 60 పరుగులు చేసి ఔటవగా... రోడ్రిగ్స్ 29 , చివర్లో రిఛా ఘోష్ 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 30 పరుగులు చేశారు.

చేజింగ్ లో ఒత్తిడి ఉన్నప్పటకీ శ్రీలంక మహిళల జట్టు ఎటాకింగ్ బ్యాటింగ్ తో పై చేయి సాధించింది. కెప్టెన్ చమరి ఆతపత్తు, హర్షిత మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆతపత్తు 43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులకు ఔటవగా.. మ్యాచ్ అప్పటికే భారత్ చేజారింది. ఫీల్డింగ్ లో పలు తప్పిదాలు కూడా భారత్ కొంపముంచాయి. శ్రీలంక మరో 8 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. ఆసియాకప్ గెలవడం శ్రీలంకకు ఇదే తొలిసారి.

Published : 
  • 28 July 2024, 7:00 PM IST