టార్గెట్ వన్డే ప్రపంచకప్… బీసీసీఐ రోడ్ మ్యాప్ రెడీ…!

2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి గాయం ఇంకా భారత క్రికెట్ అభిమానులను వెంటాడుతూనే ఉంది. స్వదేశంలో అజేయంగా ఫైనల్ చేరిన టీమిండియా చివరి అడుగులో తడబడి ట్రోఫీని చేజార్చుకుంది.

Post Published By: dialnews
Updated : 23 June 2026, 12:10 PM IST

2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమి గాయం ఇంకా భారత క్రికెట్ అభిమానులను వెంటాడుతూనే ఉంది. స్వదేశంలో అజేయంగా ఫైనల్ చేరిన టీమిండియా చివరి అడుగులో తడబడి ట్రోఫీని చేజార్చుకుంది. ఇప్పుడు ఆ నిరాశను తుడిచిపెట్టి 2027లో మళ్లీ ప్రపంచ కప్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో భారత క్రికెట్ బోర్డు ముందడుగు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటినుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
2027 వన్డే వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే ప్రణాళికలు ప్రారంభించిందని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. 2027లో జరగనున్న మెగా టోర్నీకి ముందు భారత జట్టు సరిపడా వన్డే క్రికెట్ ఆడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆటగాళ్లను పరీక్షించడంతో పాటు బలమైన జట్టును తయారు చేయడమే లక్ష్యమన్నారు.

ఇంగ్లాండ్‌తో వచ్చే నెల జరిగే మూడు వన్డేల సిరీస్ కూడా ఈ ప్రణాళికలో భాగమేనని పేర్కొన్నారు. జులై 14 నుంచి 19 వరకు జరిగే ఈ సిరీస్ భవిష్యత్ కాంబినేషన్లను పరీక్షించేందుకు ఉపయోగపడనుంది. కొత్త వరల్డ్‌కప్ సైకిల్‌లో ఇది కీలకంగా మారనుంది.భారత జట్టు ఎంపిక కమిటీ ఛైర్మన్ అజిత్‌ అగార్కర్‌, ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్‌ మధ్య పూర్తి సమన్వయం ఉందని బీసీసీఐ తెలిపింది. సెలెక్టర్లు, కోచింగ్ సిబ్బంది, జట్టు యాజమాన్యం అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారని సైకియా వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జట్టును నిర్మించడంపై దృష్టి పెట్టామన్నారు. కేవలం తక్షణ ఫలితాలే కాకుండా 2027 వరల్డ్‌కప్‌ను లక్ష్యంగా చేసుకుని ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పు, వ్యూహాలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే ఇంగ్లాండ్‌ పర్యటనకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, బుమ్రా జట్టులో చోటు దక్కించుకున్నారు. యువ పేసర్ హర్షిత్‌ రాణా కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో భాగమైన జైశ్వాల్‌, హర్ష్‌ దూబే, ప్రిన్స్‌ యాదవ్‌కు ఈసారి అవకాశం దక్కలేదు. దీంతో జట్టు కూర్పుపై చర్చ మొదలైంది.2023 వరల్డ్‌కప్ తర్వాత భారత వన్డే జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ బాధ్యతలు చేపట్టాడు. కొత్త నాయకత్వంలో జట్టు ఇప్పటికే ఆఫ్ఘన్‌పై 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌ సిరీస్‌తో పాటు రానున్న నెలల్లో జరిగే వన్డే మ్యాచ్‌లు 2027 వరల్డ్‌కప్ జట్టుకు పునాది వేయనున్నాయి. యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన క్రికెటర్లతో బ్యాలెన్స్‌ సాధించడంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది.

Published : 
  • 23 June 2026, 12:10 PM IST