ఇంగ్లాండ్తో ఆదివారం జరగనున్న మూడో వన్డే మ్యాచే అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మకు ఆఖరి మ్యాచ్ అని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెలక్టర్ల వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల్లో హిట్మ్యాన్ లేడని, ఇంగ్లాండ్ సిరీసే ఆఖరిది అని, అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యం కోరుకుంటోందని, ఇప్పటికే ఈ విషయాన్ని రోహిత్ శర్మకు వివరించినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారులతో రోహిత్ సమావేశం అయ్యాడని, బోర్డు నిర్ణయం పై అసంతృప్తిని వ్యక్తం చేశాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ విషయంలో రోహిత్ శర్మపై మేనేజ్మెంట్ ఎలాంటి ఒత్తిడి పెట్టట్లేదని స్పష్టం చేశాడు. హిట్మ్యాన్ లాంటి సీనియర్ ఆటగాడిపై ఎలాంటి ఒత్తిడి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నాడు.అతడు కూడా ఒత్తిడిని ఫీలయ్యే ఆటగాడు కాదన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి రెండు వన్డే మ్యాచ్ల్లో పరుగులు చేయలేదన్నది నిజమేనని, అయితే.. దాని వల్ల అతడి కెరీర్ విషయంలో పెద్ద తేడా ఏం ఉందన్నాడు. రోహిత్ ఫామ్లో లేడని తాను అనుకోవడం లేదన్నాడు. షాట్ ఎంపిక పని చేయకపోవచ్చన్నాడు.
లార్డ్స్లో జరగనున్న మూడో వన్డే మ్యాచ్లో అతడు తప్పకుండా మంచి ఇన్నింగ్స్ ఆడతాన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. గత ఎనిమిది వన్డే మ్యాచ్ల్లో 30.1 సగటుతో 241 పరుగులు సాధించాడు. కాగా ఇప్పటి వరకూ 287 వన్డేలు ఆడిన రోహిత్ 11 వేలకు పైగా పరుగులు చేశాడు. తన కెరీర్ లో ఎన్నో రికార్డులు అందుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేసిన హిట్ మ్యాన్ ఖాతాలో మూడు వన్డే డబుల్ సెంచరీలు ఉన్నాయి.అలాగే ఒకే ప్రపంచకప్లో 5 సెంచరీలు బాదిన ఆటగాడు కూడా అతడే. 2019 వన్డే వరల్డ్ కప్లో రోహిత్ ఏకంగా 5 సెంచరీలు బాది, ఒకే టోర్నమెంట్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.