టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కొనసాగినప్పుడు మనకు తిరుగులేదు. వీరిద్దరూ జట్టులో ఉన్నప్పుడు భారత్ టి20 వరల్డ్ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు రెండుసార్లు వెళ్ళింది. టీమిండియా కు సమకాలీన క్రికెట్లో తిరుగులేని స్థాయిని అందించిన ఘనత విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు దక్కుతుంది. అయితే జట్టులో అంతర్గత రాజకీయాలు.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి.. ఇతర కారణాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ మీద తీవ్రమైన ప్రభావం చూపించాయి. దీంతో టి20 నుంచి, టెస్ట్ ఫార్మాట్ నుంచి వీరిద్దరూ తప్పుకున్నారు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. ఐపీఎల్ లో అటు రోహిత్ ముంబై జట్టుకు.. ఇటు విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు ఆడుతున్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని.. తమ శరీరంలో యంగ్ క్రికెట్ అలానే ఉందని చూపిస్తున్నారు. రోహిత్ సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతుండగా.. విరాట్ పరుగుల వరద సాగిస్తున్నాడు.విరాట్ ఎప్పటిలాగే ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. రోహిత్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టి స్లిమ్ అయ్యాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. ఇన్ని సానుకూలతలు ఉన్న క్రమంలో అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ ఆవేదన కలిగిస్తోంది. ఇటీవల బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సరిగా ఆడలేదు. పైగా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. శరీరం సహకరించకపోవడంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయాడు. మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అతడు రాలేదు. ఇక విరాట్ కోహ్లీ కూడా అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. అతడు బ్యాటింగ్ చేసిన తర్వాత ఫీల్డ్ లోకి రాలేదు.. దీంతో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.
వయసు పెరగడం వల్ల రోహిత్ ఒకప్పటి మాదిరిగా ఆడలేక పోతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. అతడు బ్యాటింగ్ పరంగా తిరుగులేని స్థాయిలో ఉన్నప్పటికీ.. ఫీల్డింగ్ పరంగా అనుకున్న ప్రమాణాలను రీచ్ కాలేకపోతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. విరాట్ కూడా తన సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో కసరత్తులు చేస్తున్నప్పటికీ.. అవి ఐపీఎల్ స్థాయికి సరిపోవడం లేదు. పైగా అతనిలో ఒకప్పటి మాదిరిగా ఉద్రేకం కనిపించడం లేదు. ఫీల్డింగ్ లో కూడా విరాట్ లోపాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే 2027 వరల్డ్ కప్ గురించి అనేక సందర్భాల్లో గౌతమ్ మాట్లాడాడు. ఆ ట్రోఫీకి ఇంకా సమయం ఉందని.. ఇప్పుడే ఆటగాళ్లు ఎవరు ఆడుతారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేమని గౌతమ్ వ్యాఖ్యానించాడు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరికి చోటు లభించేది అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు.