తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. దిల్లీ వేదికగా నిర్వహించిన మీడియా చిట్చాట్లో ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేరుగా ఫైర్ అయ్యారు. తనపై అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలు తీసుకునే కంటే ముందే, పదేళ్లు తానే సీఎం అని ప్రకటించుకుంటున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన దానికి తల్లిగా తనకు శిక్ష వేయడం ఏంటని ప్రశ్నించిన సురేఖ, మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెపుతున్నప్పుడు తన బిడ్డ మాట్లాడిన దానికి తనపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదన్నారు.
దిల్లీలో తనకు కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ దొరకలేదని, అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన రాతపూర్వక వివరణను స్పష్టంగా సమర్పించానని వెల్లడించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని, ఒకవేళ తనపై ఏమైనా చర్యలు తీసుకుంటే రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై తిరగబడతారని కొండా సురేఖ హైకమాండ్ను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని నిలదీస్తూ.. చాలామంది రెడ్డి సామాజిక వర్గం నాయకులు బహిరంగంగా మాట్లాడినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, కేబినెట్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య కమిషన్ల పైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని, మరి వాటిపై అధిష్ఠానం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు తనను ఎవరూ రాజీనామా చేయమని అడగలేదని, తన వివరణను పార్టీ పెద్దలకు వివరించానని ఆమె స్పష్టం చేశారు.