Is the idea of the selectors of the Indian team currently playing the T20 series with Australia correct..?
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కానీ, తాత్కాలిక సారధి హార్దిక్ పాండ్యా కానీ లేరు. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వగా.. మెగాటోర్నీ మధ్యలో గాయపడిన పాండ్యా ఈ సిరీసుకు కూడా దూరమయ్యాడు. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ లో వీళ్లిద్దరిలో భారత్కు సారధ్యం ఎవరు వహిస్తారు? అనే చర్చ జరుగుతోంది. దీనికి మరికొన్ని రోజుల్లో సౌతాఫ్రికా వేదికగా జరిగే టీ20 సిరీసుతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సిరీస్ నుంచి భారత జట్టును పొట్టి ప్రపంచ కప్ కోసం రెడీ చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్ సమయానికి హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకుంటాడని మేనేజ్మెంట్ అనుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే రోహిత్ ను ఒప్పించి సౌతాఫ్రికాతో టీ20 సిరీసులో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అతనికే అప్పగించాలని అనుకుంటోంది. సెలెక్షన్ కమిటీ మీటింగ్లో ఈ విషయంపై ఒక క్లారిటీ కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికా వేదికగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వీటిలో టీ20 సిరీసులో భారత జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్గా సెలెక్టర్లు ఎంపిక చేశారట. ఇక వన్డేలపై ఫోకస్ తగ్గించిన సెలెక్టర్లు.. వన్డే సిరీసులో భారత జట్టు సారధ్య బాధ్యతలను కేఎల్ రాహుల్కు అప్పగించనున్నారట. ఇక టెస్టుల్లో మళ్లీ రోహిత్ శర్మనే కెప్టెన్సీ నిర్వహిస్తాడని తెలుస్తోంది. ఇదే ప్రకటన కనుక వచ్చేస్తే.. పొట్టి ఫార్మాట్లో రోహిత్, కోహ్లీ ఫ్యూచర్పై కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ సిరీసులో కనుక జట్టుకు రోహిత్ సారధ్యం వహిస్తే.. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్లో కూడా భారత జట్టుకు రోహిత్ శర్మనే కెప్టెన్సీ వహించే అవకాశం ఉంది.