Is Andhra Pradesh Chief Minister and YCP chief Jagan Mohan Reddy going to see his younger sister Sharmila as an enemy?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై తన చెల్లెలు షర్మిలను శత్రువుగానే చూడబోతున్నారా ? షర్మిల కాంగ్రెస్ లో చేరారు... రేపో, మాపో ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అవుతారని అంటున్నారు. అందుకే షర్మిలను ప్రత్యర్థిగానే చూడాలని వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆ పార్టీ లీడర్లకు సందేశాలు కూడా వెళ్ళాయేమో. అందుకేనా మంత్రి పెద్దిరెడ్డి అలా మాట్లాడారు అన్న చర్చ నడుస్తోంది.
వైఎస్సార్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి... తాను కూడా హస్తం పార్టీలో చేరిపోయారు వైఎస్ షర్మిల. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో తన అన్నకు పోటీగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఈ పరిణామాలపై జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం నాడు ఇంటికి మేనల్లుడి పెళ్ళి కార్డు ఇవ్వడానికి వచ్చిన చెల్లెలు షర్మిలతో జగన్ ముభావంగానే ఉన్నారు. కొన్ని నిమిషాల్లో కార్డు తీసుకొని... తర్వాత పక్క గదిలోకి వెళ్ళిపోయారు. జగన్ తో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టిన రెండేళ్ళ తర్వాత షర్మిల ఇంటికి వచ్చినా... కనీసం ఆదరణ లభించలేదు. ఈ మీటింగ్ కూడా తల్లి విజయమ్మ ఒత్తిడితోనే జరిగిందని అంటున్నారు.
ఇప్పుడు ఏకంగా YCP కి వ్యతిరేకంగా షర్మిల కాంగ్రెస్ లో చేరింది. పైగా వైఎస్సార్ చనిపోగానే... తనకు ప్రియారిటీ ఇవ్వకుండా జైల్లో చేసిన కాంగ్రెస్ అంటే జగన్ కు ఎక్కడ లేని కోపం. అందుకే షర్మిలపైనా జగన్ కు మండిపోతోంది. రాయబారం పంపినా వినకుండా షర్మిల హస్తం పార్టీలో చేరడం ఇంకా ఇబ్బందిగా ఉంది జగన్ కు. కాంగ్రెస్ - టీడీపీ పొత్తులు కూడా ఉంటాయన్న సంకేతాలను కాకినాడ సమావేశంలో మాట్లాడారు జగన్. కుటుంబాలను చీలుస్తున్నారనీ... ఇంకా వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని జగన్ కామెంట్ చేశాడు. అంతేకాకుండా... షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ ను తన అన్న జగన్ కు కాకుండా... టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు పంపడం, ఆయన రియాక్ట్ అవడం వైసీపీ శ్రేణులకు నచ్చలేదు.
షర్మిలను శత్రువుగా భావించబట్టే... సాక్షిలో అప్పుడే ఆమెకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ మొదలయ్యాయి. ఆ పత్రికలో వ్యతిరేక కథనాలు వస్తే చాలు... వైపీసీ నేతలు, కార్యకర్తలకు అర్థమైపోతుంది. వాళ్ళు మనకు శత్రువులు అని. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత దంపతలు తర్వాత... ఇప్పుడు షర్మిలను కూడా టార్గెట్ చేయబోతోంది ఆ పత్రిక. కడప ఎయిర్ పోర్టులో టీడీపీ మాజీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, దేవగుడి నారాయణ రెడ్డితో షర్మిల భర్త అనీల్ భేటీ గురించి సాక్షిలో ప్రత్యేకంగా రాశారు.
మంత్రి పెద్దిరెడ్డి కూడా కాంగ్రెస్ తమకు ప్రత్యర్థి పార్టీ... ఆ పార్టీలో ఎవరున్నా తమకు రాజకీయ ప్రత్యర్థులే... అని చెప్పారు. అంటే జగన్ ఆల్రెడీ... షర్మిల తమ శత్రువు అనే సంకేతాలు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలకు ఇచ్చేసినట్టు అర్థమవుతోంది. అందుకే ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా షర్మిలకు వ్యతిరేకంగా నోరు విప్పుతున్నారు. మరి రేపు కాంగ్రెస్ లో పదవి తీసుకున్నాక... ఆమె కూడా అన్న జగన్ ను డైరెక్ట్ గా విమర్శిస్తారా ? లేదా అన్నది చూడాలి.