YS Jagan, CM Revanth Reddy : జగన్ ఇల్లు కూల్చేసిన అధికారికి ప్రమోషన్‌.. రేవంత్‌ నిర్ణయంతో సరికొత్త రచ్చ…

జగన్ టైమ్ అసలు బాగున్నట్లు కనిపించడం లేదు. దారుణమైన పరాభవం నుంచి బయటపడక ముందే.. షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 June 2024, 4:30 PM IST

జగన్ టైమ్ అసలు బాగున్నట్లు కనిపించడం లేదు. దారుణమైన పరాభవం నుంచి బయటపడక ముందే.. షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. నిబంధనలకు విరుద్ధమని.. తాడేపల్లిలో పార్టీ ఆఫీస్‌ కూల్చేశారు. జిల్లాల్లో పార్టీ ఆఫీస్‌లకు నోటీసులు ఇచ్చారు. ఇంతకుముందే.. తెలంగాణలో మరో తలపోటు ఎదురైంది జగన్‌కు ! లోటస్‌పాండ్ ఇంటి ముందు సెక్యూరిటీ ఔట్‌పోస్ట్‌లను గ్రేటర్ అధికారులు కూల్చేశారు. దీనిపై ఆ మధ్యజరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే కూల్చివేతలకు బాధ్యున్ని చేస్తే జోనల్ అధికారి హేమంత్‌ను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. కట్ చేస్తే.. అదే అధికారికి ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో భారగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది. సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆమ్రపాలికి ఐదు కీలక శాఖలు అప్పగిస్తూ రేవంత్ తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతుండగా.. అంతకుమించి హేమంత్‌ వ్యవహారం రచ్చ రేపుతోంది. జగన్ ఇల్లు ముందు కట్టడాలు కూల్చిన అధికారికి ప్రమోషన్‌ లభించింది. జగన్ ఇల్లు ముందు అక్రమ కట్టడాలు అంటూ కూల్చిన ఘటన వివాదాస్పదం కాగా.. తమకు తెలీకుండా జరిగిందని GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌ను 10 రోజుల కిందట బదిలీ చేశారు.

ఇప్పుడు ఆయనకు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయ్. ఐతే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. ఇలాంటి ఘటన ఏదీ జరగలేదని.. జగన్‌ను కావాలని రేవంత్ టార్గెట్ చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయ్. చంద్రబాబు కోసమే రేవంత్ ఇదంతా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మరి ఇప్పుడు జగన్ ఇల్లు కూల్చేసిన అధికారికి ప్రమోషన్‌ ఇవ్వడం.. ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరి.

Published : 
  • 24 June 2024, 4:30 PM IST