పెద్దిరెడ్డిపై పవన్ రాజకీయం.. పుంగునూరులో కోట కూలడమే..?

ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది వైసీపీ నేతలను ఇప్పుడు జనసేన పార్టీ గట్టిగానే టార్గెట్ చేసింది. కొంతమంది జనసేన పార్టీలోకి వస్తుండగా.. మరి కొంతమంది పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలోకి వచ్చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు.

Post Published By: Vencateshg
Updated : 4 March 2025, 7:23 PM IST

ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది వైసీపీ నేతలను ఇప్పుడు జనసేన పార్టీ గట్టిగానే టార్గెట్ చేసింది. కొంతమంది జనసేన పార్టీలోకి వస్తుండగా.. మరి కొంతమంది పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలోకి వచ్చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం కూడా వైసీపీని బాగా ఇబ్బంది పెడుతుంది. కొంతమంది వైసీపీ నేతలను పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటివరకు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో వైసీపీని ఎప్పుడు ఫోకస్ చేయలేదు.

ఇప్పటి వరకు కొందరు వైసీపీ నేతలను.. పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఆహ్వానించారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, మాజీ మంత్రి బాలినేని వంటి వారు జనసేనలోకి వచ్చారు. త్వరలోనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే కూడా రానున్నారు. ఇక 2024 ఎన్నికలకు ముందు వైసీపీని గట్టిగా టార్గెట్ చేసి.. విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీని గట్టిగానే దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పవన్ టార్గెట్ చేశారు.

వైసీపీ హయాంలో అన్నీ తానై రెచ్చిపోయిన పెద్దిరెడ్డికి ముహూర్తం ఫిక్స్ చేసారు జనసేనాని. ఇటీవల అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నారని.. సాక్షాలతో సహా కొన్ని పత్రికలు బయటపెట్టేసాయి. దీనితో పవన్ కళ్యాణ్ కూడా దానిపై గట్టిగానే ఫోకస్ పెట్టి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏ ఏ ప్రాంతాల్లో పెద్దిరెడ్డి అటవీ భూములను ఆక్రమించారు అనే దానిపై ఇప్పుడు పవన్.. అధికారులను క్షేత్రస్థాయి నివేదిక అడిగినట్లు సమాచారం. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో కూడా పెద్దిరెడ్డి పై గతంలో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిని బయటకు లాగేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అవసరం అయితే పెద్దిరెడ్డి పై పెద్ద ఎత్తున విచారణ చేయించేందుకు.. అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు.

నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా బలంగానే ఉంది. దీనితో అక్కడ బలం పుంజుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నియోజకవర్గ జనసేన నాయకులతో, టిడిపి నాయకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారని.. పెద్దిరెడ్డిని ఓడించడమే రాబోయే ఎన్నికల్లో లక్ష్యం అని అలాగే ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథన్ రెడ్డి పై కూడా ఫోకస్ పెట్టాలని చిత్తూరు జిల్లా నేతలకు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే గ్రౌండ్ లెవెల్ లో ఒకప్పుడు రెచ్చిపోయిన వారి మీద కూడా తనకు వివరాలు ఇవ్వాలని, అలాగే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నాయకుల వివరాలు కూడా కావాలని పవన్ అడిగారట.

Published : 
  • 4 March 2025, 7:23 PM IST