వరల్డ్ కప్ పైనే అందరి దృష్టి… ఈ సారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరో ?

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సరిగ్గా వారం రోజుల్లో ప్రారంభం కానుంది. 2007లో ప్రారంభమైన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్, క్రికెట్ ప్రపంచానికి అనేక అద్భుతమైన క్షణాలను అందించింది.

Post Published By: dialnews
Updated : 2 February 2026, 1:15 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సరిగ్గా వారం రోజుల్లో ప్రారంభం కానుంది. 2007లో ప్రారంభమైన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్, క్రికెట్ ప్రపంచానికి అనేక అద్భుతమైన క్షణాలను అందించింది. ప్రతి ఎడిషన్‌లో ట్రోఫీ గెలవడమే జట్ల ప్రధాన లక్ష్యంగా ఉన్నా, మొత్తం టోర్నమెంట్‌లో స్థిరమైన ప్రదర్శన చూపిన ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుంది.ఈ అవార్డు పొందాలంటే కేవలం ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్‌లు సరిపోవు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించే స్థాయిలో ఆడాలి. అందుకే ఈ గౌరవాన్ని అందుకున్న ఆటగాళ్లు అందరూ ప్రపంచ స్థాయి స్టార్‌లుగానే నిలిచారు. ఈ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దాదాపు బ్యాటర్లు కానీ, బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు కానీ సొంతం చేసుకున్నారు. కానీ బుమ్రా ఒక్కడే బౌలర్‌గా ఈ అవార్డు దక్కించుకున్నాడు.

2007లో తొలి ఎడిషన్‌లో అఫ్రిది తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంచ్‌మార్క్ సెట్ చేశాడు. 2009లో దిల్షాన్ పవర్‌ప్లే బ్యాటింగ్‌కు కొత్త అర్థం చెప్పాడు. పీటర్సన్, వాట్సన్ వివిధ పరిస్థితుల్లో మెరిసి తమ సత్తా చాటారు. భారత్ తరఫున విరాట్ కోహ్లీ 2014, 2016లో వరుసగా ఈ అవార్డు గెలవడం అతని నిలకడైన ఆటతీరుకు నిదర్శనం. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్ భారత్‌కు అద్భుత విజయాలను అందించింది.ఇటీవలి ఎడిషన్లలో బౌలర్ల ప్రభావం కూడా పెరిగింది. 2021లో వార్నర్ ఆస్ట్రేలియాకు తొలి టైటిల్ అందించగా, 2022లో సామ్ కరన్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2024లో జస్ప్రీత్ బుమ్రా తన కచ్చితమైన లైన్-లెంగ్త్‌తో ప్రత్యర్థులను వణికించాడు.

కాగా ఈ సారి భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించబోయే 10వ టీ20 వరల్డ్ కప్‌కు ముందు, ఇప్పటివరకు ఈ అవార్డు గెలిచిన ఆటగాళ్ల జాబితా మరోసారి ఆసక్తికరంగా మారింది. ఈ టోర్నమెంట్‌లో 20 జట్లు 55 మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత్‌లో ఐదు స్టేడియాలు, శ్రీలంకలో మూడు వేదికలపై పోటీలు జరగనున్నాయి. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించగా.., టాప్ రెండు జట్లు సూపర్-8కు చేరతాయి. అక్కడి నుంచి సెమీ ఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి.2026లో ఈ మెగా టోర్నమెంట్ మళ్లీ ఉపఖండానికి రావడంతో ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం, నరేంద్ర మోదీ స్టేడియం వంటి వేదికలు మరోసారి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి మరి 2026లో ఈ జాబితాలో ఏ ప్లేయర్ చేరతాడో చూడాలి.

Published : 
  • 2 February 2026, 1:15 PM IST