ఐపీఎల్ 2026లో లీగ్ స్టేజ్ మ్యాచ్లు ముగిసిన తర్వాత ఆ జట్టు సారథ్యాన్ని వదిలేసిన రిషభ్ పంత్ .. ఇప్పుడు ఆ ఫ్రాంఛైజీనే వీడాడు. వచ్చే సీజన్కు ముందు అతడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరిపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కుల్దీప్ యాదవ్ను తీసుకుని.. రిషభ్ పంత్ను ఇచ్చేసింది. ఐపీఎల్ 2025 వేలంలో ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ పంత్ను 27 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్న లక్నో.. రెండేళ్లకే అతడిని వదిలేసి అందర్నీ ఆశ్చర్యపరించింది. 15 కోట్ల ధరతో పంత్ డీసీలో చేరిపోయాడు.ఐపీఎల్ 2025 వేలంలో రిషభ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్.. తీవ్రంగా ప్రయత్నించింది. ఇతర జట్లతో పోటాపోటీగా ధర పెంచేసింది. ఓ దశలో రూ. 25 కోట్ల కంటే తక్కువ ధరకే పంత్ను లక్నో సొంతం చేసుకుంది.
కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం కార్డు వాడటంతో ఏకంగా ధరను రూ. 27 కోట్లకు పెంచింది. డీసీ వైదొలగడంతో లక్నో పంత్ను దక్కించుకుంది. వచ్చీ రాగానే సారథ్య బాధ్యతలు అప్పగించింది. కానీ రెండు సీజన్లలో పంత్తో పాటు.. జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో తాజాగా అతడిని వదిలేసింది. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.రిషభ్ పంత్ను జట్టులోకి తీసుకున్న తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా అతడితో పాటు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. పంత్ను పొగడ్తలతో ముంచెత్తాడు. పంత్ లక్నో సూపర్ జెయింట్స్కు దాదాపు పదిహేనేళ్ల పాటు ఆడతాడనీ, ఈ ప్రయాణంలో కనీసం 4-6 ఐపీఎల్ టైటిళ్లు సాధిస్తాడనీ అప్పట్లో చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్లో ముంబై, చెన్నై జట్లను విజయవంతమైన జట్లుగా ప్రజలు చూస్తారన్న గోయెంకా పదేళ్ల తర్వాత ధోనీ, రోహిత్ లతో పాటు పంత్ పేరునే అందరూ చెప్తారన్నాడు. కావాలంటే తన మాటలు రాసిపెట్టుకోండి అంటూ సంజీవ్ గోయెంకా చెప్పిన మాటలు ఫ్యాన్స్ సెటైరిక్ గా గుర్తు చేస్తున్నారు.పంత్ను లక్నో వదిలేసిన నేపథ్యంలో సంజీవ్ గోయెంకాపై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. లక్నో మొట్టమొదటి కెప్టెన్ కేఎల్ రాహుల్ను మైదానంలోనే సంజీవ్ తిట్టిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ఇది జరిగాక రాహుల్ లక్నోను వీడాడు. తాజాగా పంత్ కూడా.. అదే బాటలో నడిచాడు.