నందమూరి అభిమానులకు ఏమాత్రం ఊహించని అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చేసింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ మళ్లీ సెట్ అయ్యింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ భారీ సినిమా తెరకెక్కబోతోందని అధికారిక ప్రకటన వచ్చేసింది. 2018లో వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ' లాంటి పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఈసారి త్రివిక్రమ్ తన రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ను పక్కనపెట్టి, పురాణాల నేపథ్యంతో కూడిన ఓ డివైన్ యాక్షన్ స్టోరీని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తారక్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "శివుడి కుమారుడు.. పార్వతి దేవికి గర్వకారణం.. దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్తో" అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నిమిషాల్లోనే వైరల్గా మారింది.
ఈ అనౌన్స్మెంట్ కోసం రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ కూడా గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఆ పోస్టర్లో ఓ పెద్ద శూలం దాని చుట్టూ డీఎన్ఏ ఆకారంలో ఉన్న మేఘాలు, బ్యాక్గ్రౌండ్లో ఒక భీకరమైన యుద్ధభూమి కనిపిస్తున్నాయి. ఆ పోస్టర్పై ఇంగ్లీషులో "ఒకే శూలం, ఒకే లక్ష్యం, ఒకే దైవ నిర్ణయం" అని రాసి ఉండటం సినిమా కాన్సెప్ట్పై ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సినిమా ప్రకటనకు కొన్ని గంటల ముందే నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో నెమలి ఎమోజీని పెట్టి క్యూరియాసిటీ పెంచారు. "ఉత్తరాన జన్మించాడు.. హృదయాల్లో ఎదిగాడు.. దక్షిణాదిన పూజలందుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా విశ్వవ్యాప్తం కాబోయే ఓ మహా కథ మొదలుకాబోతోంది" అని ఆయన ఇచ్చిన హింట్స్ చూసి నెటిజన్లు పజిల్ సాల్వ్ చేసేశారు. నెమలి వాహనం, ఈటె ఆయుధం, శివుడి కుమారుడు అనగానే ఇది కచ్చితంగా కార్తియేయుడి కథే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
https://x.com/tarak9999/status/2071557756570796349/photo/1
పోస్టర్లో డీఎన్ఏ సింబల్ ఉండటాన్ని బట్టి చూస్తే, ఇది పూర్తిగా పౌరాణిక చిత్రం మాత్రమే కాదని, పురాణాలకు ఇప్పటి మోడ్రన్ జనరేషన్కు ముడిపెడుతూ సాగే 'మైథలాజికల్ సోషియో-ఫాంటసీ' అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'దేవర' విజయాల తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయింది. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే పాన్ ఇండియా మూవీలో, అలాగే బాలీవుడ్ మూవీ 'వార్-2'లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి మాటల మాంత్రికుడి కలం బలానికి, తారక్ నట విశ్వరూపం తోడైతే బాక్సాఫీస్ వద్ద ఈ 'కార్తికేయుడి' కథ ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.