టీ20 ఛాంపియన్గా ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్కు.. భారీ భంగపాటు ఎదురైంది. పసికూన ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20 మ్యాచ్లలోనూ టీమిండియా పరాజయం పాలైంది. దీంతో చరిత్రలో తొలిసారిగా ఆ జట్టు చేతిలో సిరీస్ ఓడిపోయింది. అంతేకాకుండా మూడేళ్ల తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో ఓటమి నమోదు చేసింది. దీంతో టీమిండియాపై నెట్టింట దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాక టీమిండియా.. టెస్టుల్లో ఆశించిన మేర రాణించట్లేదు. దీంతో అతడిపై ట్రోల్స్ వస్తుంటాయి. అయితే వన్డేలు, టీ20ల్లో మాత్రం సత్తాచాటుతోంది. కానీ తాజాగా ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత.. గంభీర్ మరోసారి ట్రోలర్స్కు టార్గెట్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఈ జాబితాలో ఐస్లాండ్ క్రికెట్ కూడా చేరిపోయింది. ఇప్పటి వరకు ఐసీసీ సభ్యదేశం కూడా కాని ఐస్లాండ్ క్రికెట్ అసోషియేషన్ కూడా తన సోషల్ మీడియాలో గంభీర్ను ట్రోల్ చేసింది.
రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఐర్లాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత ఆడిన తొలి సిరీస్లోనే టీమిండియా ఓటమిపాలవ్వడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్.. తొలి మ్యాచ్లో 34 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలై సిరీస్ను చేజార్చుకుంది.ఈ సిరీస్ ముగిసిన నిమిషాల వ్యవధిలోనే ఐస్లాండ్ క్రికెట్ బోర్డు ఎక్స్ వేదికగా ఓ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. తాము గౌతమ్ గంభీర్ను మా కోచ్గా నియమించాలనుకోవడం లేదనీ, మాకు ఇష్టం లేదు కూడా అంటూ రాసుకొచ్చింది.
కానీ అతనిలో అద్భుతమైన ప్రతిభ ఉందని పేర్కొంది. ఐర్లాండ్ క్రికెట్ గొప్ప ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లను తీసుకుని ఐర్లాండ్ పిచ్లపై ఇలాంటి పేలవ ఫలితాలు రాబట్టాలంటే నిజంగానే ప్రత్యేకమైన ప్రతిభ కావాలనీ, అది గంభీర్ వద్ద పుష్కలంగా ఉందనిపిస్తోంది అంటూ సెటైర్లు పేల్చింది.మరోవైపు పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు టీ20ల సిరీస్ను టీమిండియా కోల్పోవడం పట్ల మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చిన్న జట్టు అనే ఉదాసీనతే భారత జట్టు ఓటమికి కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐర్లాండ్ను లైట్ తీసుకోవడం వల్లే.. చరిత్రలోనే అతి భయంకరమైన ఓటమి ఎదురైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాటర్లు షాట్ల ఎంపిక దారుణంగా ఉందని విమర్శలు సైతం వస్తున్నాయి. టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా టీమిండియా కొంపముంచింది.