భారత్ క్రికెట్ లో మరో స్టార్ ప్లేయర్ ముగింపు దశకు చేరింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ శర్మ కెరీర్ లో చివరి మ్యాచ్ కానుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇటు రోహిత్ కానీ, అటు బీసీసీఐ కానీ స్పందించలేదు. 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్ లో హిట్ మ్యాన్ లేడన్న వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఇక వన్డే క్రికెట్ కు కూడా రోహిత్ గుడ్ బై చెబుతున్నట్టు సమాచారం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చే 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టును నిర్మించాలని భావిస్తున్నారు.
భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యశస్వి జైస్వాల్ లాంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు చూస్తున్నారు.2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేడని, ఈ ఇంగ్లాండ్ పర్యటన తర్వాత భవిష్యత్తు కోసం వేరే ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని సెలక్టర్లు ఇప్పటికే రోహిత్కు స్పష్టం చేసినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. తుది నిర్ణయాన్ని మాత్రం రోహిత్ శర్మకే వదిలేసినట్టు ఆ కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత ఫామ్ కూడా పేలవంగా ఉండడం మరో కారణంగా చెబుతున్నారు.గత కొన్ని వన్డే ఇన్నింగ్స్లలో రోహిత్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్లోని మొదటి రెండు మ్యాచ్ల్లోనూ పెద్దగా పరుగులు చేయలేదు.
వచ్చే ఏడాది చివరి వరకూ హిట్ మ్యాన్ ఫిట్ నెస్ కాపాడుకోవడం కూడా సవాల్ గానే భావిస్తున్నారు.మరోవైపు, భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ రోహిత్ రిటైర్మెంట్ పుకార్లను కొట్టిపారేశారు. డ్రెస్సింగ్ రూమ్కు రోహిత్ పై పూర్తి నమ్మకం ఉందని, అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.కాగా రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో టీ ట్వంటీ , టెస్ట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. 2024లో భారత జట్టుకు కెప్టెన్గా టీ20 ప్రపంచకప్ అందించిన తర్వాత ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. తర్వాత 2025లో టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.