AP Assembly Elections : ఎవరు ఓడినా ఫస్టే.. భీమిలి.. ఇది చాలా హాట్‌ గురూ..

ఎన్నికలు వస్తే చాలు.. అంటే చాలు.. చిత్రవిచిత్రాలు కనిపిస్తుంటాయ్. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిస్థితే ఉంది. నేతల ప్రచారం సంగతి ఎలా ఉన్నా.. భీమిలి నియోజకవర్గం మీద.. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 31 March 2024, 6:30 PM IST

ఎన్నికలు వస్తే చాలు.. అంటే చాలు.. చిత్రవిచిత్రాలు కనిపిస్తుంటాయ్. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిస్థితే ఉంది. నేతల ప్రచారం సంగతి ఎలా ఉన్నా.. భీమిలి నియోజకవర్గం మీద.. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. గురుశిష్యులు, అన్నదమ్ములుగా పేరు ఉన్న అవంతి, గంటా.. భీమిలి నుంచి నువ్వా నేనా అంటున్నారు. ఇద్దరి పొలిటికల్ కెరీర్ చూస్తే.. దాదాపు సేమ్. ఇంతవరకు ఓటమి తెలియని నేతలు వీళ్లిద్దరు! ఒకరు ఏకంగా పోటీ చేసిన ఐదుసార్లు వరుసగా విజయం సాధిస్తే.. మరొకరు రాజకీయాలకు వచ్చి పోటీ చేసిన మూడు ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య యుద్ధం జరగబోతుంది. ఇందులో ఒకరు ఓటమి పాలవడం ఖాయం. దీంతో ఎవరు ఓడినా.. వారికి అదే ఫస్ట్ ఓటమే! దీంతో ఓడేది ఎవరు.. ఓడించేది ఎవరు అనే చర్చ భీమిలిలో ఆసక్తి రేపుతోంది.

1999లో టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు.. పోటీ చేసిన చేసిన ప్రతీ ఎన్నికలో విజయం సాధించారు. టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్‌.. పార్టీ ఏదైనా సరే ఆయనకు ఓటమి అన్నదే కనిపించలేదు. అవంతి శ్రీనివాస్ ట్రాక్‌ రికార్‌ కూడా ఆల్‌మోస్ట్ సేమ్‌. గంటాకు శిష్యుడిగా ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి.. 2009లో భీమిలి నుంచి గెలిచారు. తర్వాత టీడీపీలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అయ్యారు. ఇలా మూడుసార్లు పోటీ చేసి.. మూడుసార్లు గెలిచారు. ఐతే గంటా, అవంతి.. ఒకే స్థానం నుంచి పోటీ చేసే పరిస్థితి ఇంతవరకు రాలేదు.

ఇప్పుడు మాత్రం సీన్ మారింది. భీమిలి నుంచి వైసీపీ తరఫున అవంతి, టీడీపీ నుంచి గంటా పోటీ చేస్తున్నారు. గంటాకు దోబూచులాడిన భీమిలి నియోజకవర్గమే చివరికి దక్కడంతో వీరిద్దరి మధ్య పోటీ అనివార్యమైంది. వీరిద్దరిలో ఒకరు ఓటమిపాలవడం అనివార్యం. ప్రస్తుతం ఎవరు ఓటమిపాలవుతారు ఎవరు గెలుస్తారనే చర్చ ఆసక్తి రేపుతోంది. శిష్యున్ని గురువు గంటా ఓడిస్తారా.. గురువును మించిన శిష్యుడిలా అవంతి మిగులుతారా అనేది మిలియన్ డాలర్ డిస్కషన్‌గా మారింది.

Published : 
  • 31 March 2024, 6:30 PM IST