సల్మాన్ ఖాన్ x వంశీ పైడిపల్లి…!

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వరుస భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యానర్ నుండి వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్

Post Published By: dialnews
Updated : 8 April 2026, 9:15 PM IST

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వరుస భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యానర్ నుండి వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ కలయికలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు #SVC63 అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌పై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం, ఏప్రిల్ 18న ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సల్మాన్ ఖాన్ వంటి మాస్ హీరోకు సరిపోయే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథను వంశీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలోని మరో ప్రధాన ఆకర్షణ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా నయనతార నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జవాన్ సినిమాతో ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నయనతార, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.'బృందావనం', 'ఎవడు', 'ఊపిరి', 'మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వంశీ పైడిపల్లి, చివరగా విజయ్ హీరోగా 'వారసుడు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు నేరుగా బాలీవుడ్ స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయని టాక్.

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం పాన్-ఇండియా మార్కెట్‌పై దృష్టి సారించారు. ఇప్పటికే చరణ్‌తో 'గేమ్ చేంజర్' వంటి భారీ ప్రాజెక్టులు చేసుండగా, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా అనౌన్స్ చేయడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. సల్మాన్ ఖాన్ మాస్ మేనియా, వంశీ పైడిపల్లి స్టైలిష్ మేకింగ్, నయనతార గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ఏప్రిల్ 18న ప్రారంభం కానున్న ఈ షూటింగ్ కోసం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Published : 
  • 8 April 2026, 9:15 PM IST