విజయవాడ మేయర్ పీఠం ఎవరిది..? రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపబోయే ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు చాలా మంది లీడర్లు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే దేవినేని కుటుంబం నుండి వచ్చిన ఒక సోషల్ మీడియా పోస్ట్ బెజవాడ పాలిటిక్స్లో ఒక్కసారిగా సస్పెన్స్ రేకెత్తించింది.
దేవినేని చందు తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేష్ను కలవడమే కాకుండా.. "ఒక కొత్త ఆశ" అంటూ పెట్టిన పోస్ట్ మేయర్ రేసును సూచిస్తోందని అంతా భావిస్తున్నారు. విజయవాడ నగరంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు లీడర్లు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. దేవినేని కుటుంబం కూడా తమకు ఉన్న పాత ఇమేజ్ను వాడుకుని బెజవాడ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.
అయితే, అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఎవరికీ ముందస్తు కన్ఫర్మేషన్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన ఒరిజినల్ కేడర్కే సీటు దక్కుతుందని అంతర్గత సమాచారం అందుతుండటంతో, చివరి నిమిషంలో టికెట్ ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి మరికొన్ని ట్విస్ట్లు చోటుచేసుకునే అవకాశం ఉంది.