జనసేన పార్టీలో ఇప్పుడు ఓ వార్త హాట్ టాపిక్గా మారింది. తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్లనైనా సరే ఉపేక్షించేది లేదని జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి నిరూపిస్తున్నారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, అరవ శ్రీధర్లకు అధినేత పవన్ కల్యాణ్ నుండి అత్యవసర పిలుపు వచ్చింది. అసలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు ఏంటి..? త్రిసభ్య కమిటీ నివేదికలో ఏముంది..? పవన్ కల్యాణ్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు..? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇటీవల కొన్ని తీవ్రమైన లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఒక మహిళా కానిస్టేబుల్ తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ను ఎమ్మెల్యే శ్రీధర్ మానసికంగా, శారీరకంగా వేధించారని, అర్థరాత్రి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టారని బాధితురాలు ఆరోపించారు. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో మరియు పొలిటికల్ సర్కిల్స్లో లీక్ అవ్వడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.
ప్రతిపక్షాలు కూడా దీనిని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక అస్త్రంగా మార్చుకున్నాయి. మహిళల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావించే పవన్ కల్యాణ్.. ఈ ఆరోపణలను మొదటి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా, ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కమిటీని వేసి విచారణ జరిపించారు. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక పవన్ చేతికి రావడంతో శ్రీధర్ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై కూడా పలు వివాదాస్పద అంశాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల ప్రవర్తన అత్యంత పారదర్శకంగా ఉండాలని భావిస్తున్న పవన్ కల్యాణ్.. ఈ ఆరోపణలను చాలా సీరియస్గా తీసుకున్నారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని ఆయన ఇప్పటికే గట్టి సంకేతాలు ఇచ్చారు. ఈ ఆరోపణలపై పైన పైన తేల్చేయకుండా.. గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పవన్ కల్యాణ్ గతంలోనే ఒక 'త్రిసభ్య కమిటీ'ని రంగంలోకి దించారు. ఈ కమిటీ నియోజకవర్గాల్లో పర్యటించి, బాధితుల నుంచి, స్థానిక నేతల నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది.
అయితే తాజా అప్డేట్ ప్రకారం.. ఈ కమిటీ తన విచారణను పూర్తి చేసి, పూర్తి వివరాలతో కూడిన ఒక సీక్రెట్ రిపోర్ట్ను పవన్ కల్యాణ్కు అందజేసింది. ఈ నివేదికలో ఎమ్మెల్యేల తీరుపై కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలపై అధికారులతో కీలక సమీక్షా సమావేశంలో ఉన్నారు. ఈ సమీక్ష ముగిసిన వెంటనే.. సదరు ఇద్దరు ఎమ్మెల్యేలను పవన్ కల్యాణ్ పర్సనల్గా కలవనున్నారు.కమిటీ ఇచ్చిన రిపోర్టును వారి ముందు పెట్టి, లైన్ టు లైన్ వివరణ అడగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యేల వివరణ సంతృప్తికరంగా లేకపోతే.. వారిపై క్రమశిక్షణా చర్యలు, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టకూడదనే పవన్ కల్యాణ్ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ భేటీ తర్వాత పవన్ కల్యాణ్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.